హుజూర్నగర్లో కాంగ్రెస్ కేడర్పై టీఆర్ఎస్ కన్ను
స్థానిక సంస్థల ప్రతినిధులను చేర్చుకోవడంపై దృష్టి
బూత్ స్థాయి సమావేశాల్లో పార్టీ ఇన్చార్జీలు బిజీ
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగియనుండగా, ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సోమవా రం భారీ ర్యాలీతో నామినేషన్లు వేసేందుకు మిగిలిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఆవిర్భావం నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. ఒక్కసారి కూడా విజయం సాధించని టీఆర్ఎస్, ఉప ఎన్నికలో గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 60 మందికి పైగా పార్టీ ఇన్చార్జీలను నియమించిన టీఆర్ఎస్, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించింది. పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి అంతా తానై పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. తమకు కేటాయించిన మండలాలకు చేరుకు న్న టీఆర్ఎస్ ఇన్చార్జీలు బూత్ కమిటీ సమావేశాలపై దృష్టి కేంద్రీకరించారు. బూత్ కమి టీ సమావేశాల్లో స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తూ, సొంత పార్టీతో పాటు కాం గ్రెస్ బలాలు, బలహీనతలను అంచనా వేసే పనిలో ఉన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ఉన్న నేతలు, సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలు సేకరించే పనిలో ఉన్నారు.
చేరికలపైనే ప్రధానంగా దృష్టి..!
హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉండగా.. మెజారిటీ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికలపై టీఆర్ఎస్ ప్రధాన దృష్టి సారించింది. 7 మండలా ల్లో ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు, నలుగురు ఎంపీపీలు టీఆర్ఎస్కి చెందిన వారు కాగా, మూడు రోజుల క్రితం కాంగ్రెస్కు చెందిన జెడ్పీటీసీ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. శనివారం తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. మండలానికి ఒకరిద్దరు మినహా, కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్లు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు గ్రామాల్లో పలుకుబడి కలిగిన నేతలు, కుల సంఘాల నేతలను కూడా పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించింది. వచ్చే నెల 5 లోగా చేరికల కార్యక్రమాన్ని కొలిక్కితెచ్చి.. ప్రచారపర్వాన్ని పరుగెత్తించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రోడ్షోలపైనా పార్టీ ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారు.