ఎలాంటి పోరాటానికైనా సిద్ధం

14 May, 2020 02:35 IST|Sakshi
గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ప్రసంగిస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.. ప్రధానిని కలుస్తాం 

నిరసన దీక్షలో ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు అంశం తెలంగాణకు జీవన్మరణ సమస్య అని, దీనిపై ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 3 టీఎంసీల నీటిని తరలిస్తూ అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో కాంగ్రెస్‌ నేతలు నల్ల రిబ్బన్లు కటు ్టకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్‌ తరఫున ప్రధాని మోదీని కలుస్తామన్నారు. కేసీఆర్‌ చేతకానితనం వల్లే పరిస్థితి  వచ్చిందని, పోతిరెడ్డిపాడు పనులు ప్రారంభమైన రోజే సీఎం కేసీఆర్‌ రాజీనామా చే యాలన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ జిల్లాలు నష్టపోతాయన్నారు. ఈ జీవోపై కోర్టులను ఆశ్రయిస్తామని, సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పోతిరెడ్డిపాడుపై అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు తమ పోరుసాగుతుందని, అవసరమైతే ‘చలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చేందుకూవెనుకాడబోమన్నారు.దీక్షలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు