‘చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకో’

19 Apr, 2020 12:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఓ వైపు కరోనా కట్టడికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపడుతూనే మరోవైపు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ పశ్చిమనియోజకవర్గంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ క్రమంలో కార్మికులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు మంత్రి అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి రాజకీయ విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రతీ ఒక్క అంశంలో మెలిక పెడుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా పేదలకు సీఎం జగన్‌ కొత్త రేషన్‌ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ గుర్తుచేశారు.  

చదవండి:
అయ్యన్నా.. చౌకబారు విమర్శలు మానుకో
‘బాబూ! మీ ఏడుపు ఆగదు.. బుద్ధి మారదు’

మరిన్ని వార్తలు