డాక్టర్‌ నగేష్‌కే  వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలు

20 Jun, 2019 09:09 IST|Sakshi
డాక్టర్‌ కే.నగేష్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలను కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ కే.నగేష్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడేళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఆయన కరీంనగర్‌ నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

వృత్తిరీత్యా వైద్యుడైన నగేష్‌కు అమరావతిలో జరిగిన ఏపీ ప్లీనరీ సమావేశాలు, హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించే అవకాశాన్ని అధిష్టానం కల్పించింది. ప్లీనరీలో నగేష్‌ ప్రసంగం పార్టీ అధినాయకత్వాన్ని, శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు సమస్యపై, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకారం అందించారు. దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మితమైన రాజీవ్‌ గృహకల్ప సముదాయాలు శిథిలావస్థకు చేరడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా నగేష్‌ విశేషంగా కృషి చేశారు.


పార్టీ బలోపేతమే లక్ష్యం : డాక్టర్‌ నగేష్‌
జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు నూతనంగా నియామకమైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కే.నగేష్‌ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికవ్వడం తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో జగన్‌ ముందుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగా ణలో కూడా పార్టీ బలోపేతానికి అధిష్టానం దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని అన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన గట్టు శ్రీకాంత్‌రెడ్డికి, అందుకు సహకరించిన వైఎస్‌ జగన్, తదితర నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు