పూజపై బాలకృష్ణ కవితలు.. నెటిజన్ల సెటైర్లు

22 Oct, 2018 10:21 IST|Sakshi

ఎంత పెద్ద డైలాగ్‌నైనా అలవోకగా చెప్పేయడం నందమూరి బాలకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు అప్పుడప్పుడు తన తెలుగు భాషా ‘ప్రావీణ్యం’తో అభిమానులను ఆనందపరుస్తుంటారు ఆయన. ఒక్కసారి డైలాగ్‌ చెప్పడం మొదలు పెట్టారంటే ఆయనను ఆపడం ఎవరితరం కాదు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం కాస్త తడబడుతూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. ఆదివారం జరిగిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో అభిమానులను ఆకట్టుకున్నారు. అందులో భాగంగా హీరోయిన్‌ పూజా హెగ్డేను పొగుడుతూ కవితల జల్లు కురిపించారు. అయితే.. ‘ఈ కవితల అంతరార్థం కూడా అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది కదా’ అంటూ బాలయ్యపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
 

నాకు జమఝ్‌ అయ్యేలా బోలండి!
‘లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై.. అంటూ బాలకృష్ణ చెప్పిన కవిత తమకు అర్థం కాలేదంటున్నారు కొంతమంది నెటిజన్లు. ‘అయ్యా ఈ భాషాకో తెల్గూమే బోలే మేధావుల్‌ హైతే.. నాకు జమఝ్‌ అయ్యేలా బోలండి ప్లీజ్‌’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంత మంది మాత్రం... ‘అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్యూషన్‌కు వెళ్లాల్సిందేనంటూ’ తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు.. ఫ్లర్టింగ్‌ అనేది ఒక యూనివర్సిటీ అయితే బాబు దానికి ఎండీ’ అంటూ ఇంకొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. పూజాను పొగుడుతున్న వీడియోను షేర్‌ చేసి... ‘బాలయ్య చెప్పిన పాఠం ఫాలో అవ్వండి.. అమ్మాయిని పడేయండి’ అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా గతంలో సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళల గురించి బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు కోరారు కూడా.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

మరిన్ని వార్తలు