ఫించ్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

8 Mar, 2019 15:36 IST|Sakshi

రాంచీ: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో ఫించ్‌ తన పూర్వపు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. ఇది ఫించ్‌కు 19వ వన్డే ఫిఫ్టీ. అయితే వైట్‌ బాల్‌ క్రికెట్‌ పరంగా చూస్తే గతేడాది జూలై తర్వాత ఫించ్‌కు ఇది తొలి హాఫ్‌ సెంచరీ. ఓవరాల్‌గా చూస్తే తొమ్మిది ఇన్నింగ్స్‌ల తర్వాత ఫించ్‌ మొదటి అర్థ శతకం సాధించాడు.

అతనికి జతగా ఖాజా కూడా హాఫ్‌ సెంచరీ నమోదు చేయడంతో ఆసీస్‌ స్కోరు పరుగులు పెడుతోంది. ఆసీస్‌ 29 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 179 పరుగులు చేసింది. దాంతో  గత 19 వన్డేల పరంగా చూస్తే ఆసీస్‌ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ ఆది నుంచి దూకుడును కొనసాగించింది. ఒకవైపు పేలవమైన భారత్‌ ఫీల్డింగ్‌ను సద్వినియోగం చేసుకున్న ఆసీస్‌ ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నారు.

ఇక్కడ చదవండి: ధావన్‌ వదిలేశాడు..!

అమర జవాన్లకు టీమిండియా ఘన నివాళి

>
మరిన్ని వార్తలు