ధావన్‌-కోహ్లి ఎట్‌ 3 వేలు

17 Jan, 2020 15:41 IST|Sakshi

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ మెరిశాడు. తొలి వన్డేలో 74 పరుగులు సాధించిన ధావన్‌.. రెండో వన్డేలో కూడా యాభైకి పైగా పరుగులు సాధించి తనపై వస్తున్న  విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఇది వరుసగా ధావన్‌కు మూడో హాఫ్‌ సెంచరీ. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన చివరి టీ20ల్లో కూడా ధావన్‌ హాఫ్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, విరాట్‌ కోహ్లితో కలిసి మూడు వేల వన్డే పరుగుల  భాగస్వామ్యాన్ని ధావన్‌ సాధించాడు. ఓవరాల్‌గా మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన 40వ జోడి కాగా, భారత్ తరఫున 10 జోడి. ఇక మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి-ధావన్‌లు సాధించే క్రమంలో వీరి యావరేజ్‌ 62.50గా ఉంది. ఇది మూడో అత్యుత్తమం కాగా ఏబీ డివిలియర్స్‌-ఆమ్లా(72.34)లు తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రోహిత్‌-కోహ్లి(64.06) జోడి ఉంది. (ఇక్కడ చదవండి: అయ్యో.. రోహిత్‌)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగా రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్‌(42) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జత కలిశాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లి ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు.కాగా, ధావన్‌ 96 పరుగుల వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్‌గా ఔటయ్యాడు. 29 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ జట్టు రెండు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు