CWC 2023: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క

12 Nov, 2023 21:09 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌  చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు స్కోర్‌ 38 ఓవర్లు ముగిసిన అనంతరం 173/6గా ఉంది. ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలిచే అవకాశాలు లేవు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సమయంలో టీవీల్లో తారసపడిన పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సూపర్‌ టచ్‌లో కనిపించిన విరాట్‌ కోహ్లి 51 పరుగుల వద్ద వాన్‌ డర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో అతని భార్య అనుష్క శర్మ ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కోహ్లి 50వ వన్డే సెంచరీ కోసం అతని కంటే అతని భార్య ఎక్కువగా పరితపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇదే మ్యాచ్‌లో తారసపడిన మరో సన్నివేశం సైతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. విరాట్‌ నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీసిన అనంతరం అతనికంటే అతని భార్య అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి విరాట్‌-అనుష్క వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోలో సైతం వీరిద్దరే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే, విరాట్‌ వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక​ సెంచరీల రికార్డును (49) బద్దలు కొట్టేందుకు కేవలం సెంచరీ దూరంలో ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు