ఇంకా ఆశే నిలబెడుతుంది: క్రికెటర్‌ ఆవేదన

29 Nov, 2019 11:40 IST|Sakshi

కరాచీ:  తాను దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ తనపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నిస్తున్నాడు పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఫవాద్‌ అలామ్‌. తనను అసలు సెలక్షన్‌ కమిటీలో పట్టించుకో పోవడంతో అలామ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరిసారి 2009లో పాకిస్తాన్‌ తరఫున ఆడిన అలామ్‌.. దేశవాళీ మ్యాచ్‌ల్లో 164 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 12, 106 పరుగులు చేశాడు. దాదాపు 57.00 సగటుతో ఉన్నప్పటికీ పీసీబీ సెలక్టర్లు మాత్రం అలామ్‌ను విస్మరిస్తున్నారు. దాంతో అలామ్‌ స్థానిక వార్తా చానల్‌తో మాట్లాడుతూ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవడం బాధిస్తుంది.

మనం సత్తాచాటుకున్న పట్టించుకోలేకపోతే బాధ అనేది సహజంగానే వస్తుంది. నన్ను ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకైతే తెలీదు. కానీ నేను ఆశ కోల్పోలేదు. నన్ను ఆశే నిలబెడుతుంది. ప్రపంచంలో నిలవాలంటే ఆశే ముఖ్యం. ఆ ఆశే నన్ను ఇంకా రాటుదేలేలా చేస్తుంది’ అని ఫవాద్‌ అలామ్‌ తెలిపాడు.  పాకిస్తాన్‌ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అలామ్‌.. ఇటీవల ఖ్వాయిద్‌ ఈ అజామ్‌ ట్రోఫీలో సింధ్‌ తరఫున ఆడి డబుల్‌ సెంచరీ చేసి తాను రేసులో ఉన్నానని సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు. కానీ పాకిస్తాన్‌ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే తాను మళ్లీ పాకిస్తాన్‌ తరఫున ఆడతాననే ఆశతో ఉన్నాడు అలామ్‌. అంతకుముందు పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ దృష్టికి సైతం ఇదే విషయాన్ని తీసుకెళ్లానని చెప్పాడు. కాకపోతే అలామ్‌ ఏమీ చెప్పలేదని సర్ఫరాజ్‌ అంటున్నాడు.


 

మరిన్ని వార్తలు