క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట 

18 Apr, 2019 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: కున్‌మింగ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సాకేత్‌ మైనేని–ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (భారత్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–ప్రజ్నేశ్‌ జోడీ 7–6 (7/5), 6–4తో ఎన్రిక్‌ లోపెజ్‌ పెరెజ్‌ (స్పెయిన్‌)–లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్‌) జంటపై గెలిచింది.

74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట రెండో సెట్‌లో ఏకంగా తొమ్మది బ్రేక్‌ పాయింట్లను కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం 6–4, 7–6 (7/4)తో యెకాంగ్‌ హి–డి వు (చైనా) జోడీపై నెగ్గగా... విష్ణువర్ధన్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జంట 6–7 (4/7), 6–7 (7/9)తో సాండెర్‌ అరెండ్స్‌ (నెదర్లాండ్స్‌)–వీస్‌బార్న్‌ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.    
 

మరిన్ని వార్తలు