సింధు శుభారంభం

7 Nov, 2018 01:38 IST|Sakshi

ఫుజౌ (చైనా): ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21–13, 21–19తో ప్రపంచ 30వ ర్యాంకర్‌ ఎవగెనియా కొసెత్స్‌కోవా (రష్యా)పై గెలిచింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధుకు రెండో గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే కీలకదశలో సింధు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ బుసానన్‌ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) ద్వయం 16–21, 25–27తో కిమ్‌ యాస్‌ట్రప్‌–ఆండర్స్‌ రస్‌ముసేన్‌ (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 19–21, 21–15, 17–21తో షిహో తనక–కొహారో యోనెమోటో (జపాన్‌) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. 

మరిన్ని వార్తలు