సింధు సంపాదన రూ.39 కోట్లు

8 Aug, 2019 05:00 IST|Sakshi

‘ఫోర్బ్స్‌’ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానం

న్యూయార్క్‌: తెలుగుతేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం ఆమె గతేడాది సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్‌ డాలర్లు)గా తేల్చింది. ‘సింధు విలువైన మార్కెట్‌ కలిగిన భారత మహిళా అథ్లెట్‌గా కొనసాగుతోంది. ఆమె గతేడాది సీజన్‌ ముగింపు టోర్నీ అయిన ‘బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’లో విజేతగా నిలువడంతో ఆమె బ్రాండింగ్‌కు ఢోకా లేకపోయింది’ అని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్‌మెంట్లు, అప్పియరెన్స్‌ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జించే మహిళా అథ్లెట్ల టాప్‌–15 జాబితాలో భారత్‌ నుంచి మరే క్రీడాకారిణి కూడా ఆమె సమీప దూరంలో లేదు. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ 29.2 మిలియన్‌ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు