చాంపియన్‌ జిదాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌

27 Jan, 2019 10:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణ్, వాసన్‌ స్మారక 7 ‘ఎ’ సైడ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో జిదాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ చాంపియన్‌గా నిలిచింది. యంగ్‌ డైనమోస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం ఈసీఐఎల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా జరిగిన ఫైనల్లో జిదాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 1–0తో రెయిన్‌బో ఫుట్‌బాల్‌ క్లబ్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో అబ్బాస్‌ యూనియన్‌పై జిదాన్, యూఎస్‌ఎఫ్‌సీపై రెయిన్‌బో జట్లు విజయం సాధించాయి. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి జీపీ ఫల్గుణ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రెండు రోజుల పాటు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించారు. విజేతగా నిలిచిన జిదాన్‌ జట్టుకు రూ. 7000, రెయిన్‌బో జట్టుకు రూ. 5000 ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ కార్యక్రమలో ఈసీఐఎల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యులు బాలమురుగన్, భాస్కర్‌ రెడ్డి, నరసింహా తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు