నల్లబంగారు నేల.. మంచిర్యాల

11 Oct, 2016 11:08 IST|Sakshi

ఘన చరిత్ర.. ఈ ప్రాంతం సొంతం
ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలకు నెలవు
పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి


రెండో అన్నవరంగా కొలువైన గూడెం సత్తన్న గుడి.. సిరుల వేణి సింగరేణి నెలవైన బొగ్గు గని... ఎల్లంపల్లి జలసిరి.. ఎల్‌మడుగు అందాల ఝరి.. జైపూర్ విద్యుత్ వెలుగులు.. దట్టమైన కవ్వాల్ అడవులు.. ఇవీ... మంచిర్యాల జిల్లాలో అలరారే అద్భుతాలు. ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న మంచిర్యాల నేటి నుంచి స్వయం ప్రతిపత్తిని పొంది, మంచిర్యాల జిల్లాగా ఆవిర్భవిస్తోంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విశేషాల సమాహారం.  - మంచిర్యాల టౌన్
 
ఈ పేరెలా వచ్చిందంటే..
 మంచిర్యాల అనే పేరు వెనక పెద్దగా కథలేమీ లేకపోయినా, ప్రాచుర్యంలో మాత్రం ఇక్కడ కొన్ని కథలు వినిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా రాముడు సీత కోసం వెతుక్కుంటూ ఇక్కడి ప్రాంతంలోని గోదావరి తీరానికి వచ్చాడని, ఇక్కడే సేద తీరగా, రాత్రి సమయంలో ఎన్నడూ లేని విధంగా బాగా నిద్రపోయాడని, అనంతరం ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇక్కడ మంచి నిద్ర వచ్చింది, ఈ నేల మంచిదని అంటూ వెళ్లాడని ఓ కథనం ఉంది.
 
 మంచి నేల అనేది వాడుకలోకి వచ్చేసరికి మంచిర్యాల అనే పేరు వచ్చిందని చెబుతారు. దీంతో పాటు మరో కథనం ఉంది. బ్రిటీషు వారి కాలంలో నిజాం నవాబులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్వే లైను వేశారు. ఆ సమయంలో మధ్యలో ఎక్కడా స్టేషన్ లేకపోగా, సేద తీరేందుకు ఇక్కడే ఓ గెస్ట్ హౌజ్‌ను కట్టారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో, మరో మాంచెస్టర్‌గా దీన్ని తయారు చేయాలని అప్పుడు నిర్ణయించినట్లు చెబుతారు.
 
 అందుకే మంచిర్యాలలో ఇనుము ఫ్యాక్టరీని సైతం ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా అది మూతపడింది. మరో మాంచెస్టర్ సిటీగా చేయాలనుకోవడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని, ఆ పేరు వాడుకలో మారుతూ మంచిర్యాలగా నిలిచిందన్నది మరో కథనం. గోదావరి తీరాన ఉండడం, ఇక్కడికి రకరకాల రాళ్లు కొట్టుకు వస్తుండడంతో, ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది రాళ్ల సేకరణకు వచ్చేవారని, అందుకే దీనిని మంచి రాళ్లు దొరికే స్థలంగా పిలుస్తూ, మంచిర్యాల అన్నారనే కోణమూ ఉంది.
 
 వెలుగు తెచ్చిన నేతలు
 మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం సంపాదించింది ఇక్కడి రాజకీయవేత్తలే. 1967-72లో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జేవీ నర్సింగరావుది దండేపల్లి మండలం ధర్మరావుపేట్. శాసనసభ్యుడిగా, మంత్రిగా, విద్యుత్ శాఖ బోర్డు చైర్మన్‌గా, ఉప ముఖ్యమంత్రిగా తన సేవలను అందించారు.
 
 న్యాయశాస్త్రం చదివిన జేవీ విద్యార్థి దశ నుంచే సేవపై తన అభిరుచిని పెంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి అపజయం పొందారు. 1955లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించి, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో జేవీ రోడ్లు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్ శాఖలను నిర్వహించారు. 1963 నుంచి 1967లో అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెన్నెల మండలం జోగాపూర్‌కి చెందిన ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని పాత్ర పోషించారు. హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ట్ అయిన చంద్రయ్యది జన్నారం మండలం తిమ్మాపూర్.
 
 జిల్లాకే తలమానికం బొగ్గు గనులు
 మొదట బొగ్గు గని ఖమ్మం జిల్లాలో ఏర్పాటవగా ఆ తర్వాత 1927లో మన బెల్లంపల్లిలోనే తవ్వారు. అప్పటి నుంచి బెల్లంపల్లిలో సౌత్‌క్రాస్‌కట్. నెం.2 ఇంక్లయిన్, 24 డిప్, 84, 85 డిప్ గనులు, 68 డిప్ గని, శాంతిఖని, 1961లో మందమర్రి, రామకృష్ణాపూర్‌లలో, 1971లో శ్రీరాంపూర్, 1991లో చెన్నూరు ప్రాంతాల్లో బొగ్గు గనులు ఆవిర్భవించాయి.
 
 తూర్పు ప్రాంతంలో వెలసిన భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు గనులతో మంచిర్యాల జిల్లాలో సుమారు 14 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు మరో ఏడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, సింగరేణిపై ఆధారపడి మరో 15 వేల మంది ఉపాధిని పొందుతున్నారు. జైపూర్‌లో 1200ల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహాలు, ఖనిజ, వృక్ష సంపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయం ఇక్కడి మరిన్ని విశేషాలు. ఏసీసీ ప్రాంతంలో సిమెంట్ తయూరీ కంపెనీ ఉంది.

మరిన్ని వార్తలు