ఎస్‌బీఐలో భారీ అగ్ని ప్రమాదం

26 Apr, 2017 11:22 IST|Sakshi
- షార్ట్‌ సర్యూట్‌తో కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫర్నీచర్‌
 
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సిల్‌ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి బ్యాంకు ముసివేసిన తర్వాత షార్ట్‌ సర్యూట్‌తో మంటలు వ్యాపించి భారీ ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ పూర్తి దగ‍్ధమయ్యాయి. ఫైర్‌ సిబ్బంది మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవభారత్‌ వద్ద గల ఎస్‌బీఐ సిల్‌ బ్రాంచ్‌లో రాత్రి బ్యాంకులో పెద్దగా ఫైర్‌ సైరన్‌ మోగింది.
 
సైరన్‌ విన్న చుట్టుపక్కల కాలనీ వాసులు బయటకు వచ్చి చూసే సరికి బ్యాంకులో మంటలు వచ్చి దట్టమైన పొగలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న బ్యాంకు మేనేజర్‌ పానుగంటి అప్పారావు హుటాహుటిన అక్కడికి చేరుకునే సరికి మంటలు తీవ్ర స్థాయికి చేరాయి. షార్టుసర్యూట్‌ వల్లే సంఘటన సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ షుకూర్, ఎస్‌ఐ కరుణాకర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 
మరిన్ని వార్తలు