ఇద్దరమ్మాయిలతో అపరిచితుడు

12 Mar, 2015 00:18 IST|Sakshi
ఇద్దరమ్మాయిలతో అపరిచితుడు

నారీనారీ నడుమ మురారి కానున్నారు నటుడు విక్రమ్. తన తాజా చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. విక్రమ్‌కు ఇద్దరు నాయికలతో నటించడం కొత్తేమి కాదు. ధూల్, రాజబాట తదితర చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటించారు. అయితే తాజాగా ఇంతకుముందు జత కట్టని భామలతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఐ వంటి బ్రహ్మాండ చిత్రం తరువాత ప్రస్తుతం పత్తు ఎండ్రత్తుక్కలే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చెన్నై చిన్నది సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు.
 
 అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి హిట్ కొట్టిన వర్ధమాన దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి విక్రమ్ పచ్చజెండా ఊపారు. ఇందులో ఆయనకు జంటగా అందాల భామలు కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్ నటించడానికి రెడీఅవుతున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ తొలి చిత్రం నాయకి ప్రియా ఆనంద్ అన్నది తెలిసిన విషయమే. తన తదుపరి చిత్రంలోను దర్శకుడు ఆమెనే ఒక నాయకిగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో కథా నాయకుడి పాత్రకు విక్రమ్ మాత్రమే చేయగలరని దర్శకుడు అభిప్రాయం. అలాగే అరిమా నంబి చిత్రానికి ఇది పూర్తి విరుద్దంగా, వైవిధ్యంగా ఉంటుందంటున్నారు. చిత్రం జూన్‌లో సెట్‌పైకి వెళ్లనుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు