బ్యాగులే.. రైళ్లను కబ్జా చేస్తున్నాయి!

23 Oct, 2019 09:38 IST|Sakshi

మనిషి నిల్చునే స్థలంలో బ్యాగులను వేస్తున్నారు 

కొందరైతే బ్యాగులతోనే బోగీల్లో నిల్చుంటున్నారు 

వెరసి రైళ్లలో వేరే ప్రయాణికులకు స్థలం దొరకట్లేదు 

తమ సర్వేలో ఇదే విషయం వెల్లడైందన్న ఓ రైల్వే అధికారి  

సాక్షి, ముంబై: లోకల్‌ రైళ్లలో లోపలికి దూరేందుకు స్థలం లభించకపోవడానికి ప్రధాన కారణం ప్రయాణికులు తమ భుజాలకు వేసుకున్న బ్యాగులేనని ఓ రైల్వే అధికారి వెల్లడించారు. భుజానికి వెనక వేలాడుతున్న ఒక్కో బ్యాగు ఒక ప్రయాణికుడి స్థలం ఆక్రమించుకుంటోందని అధ్యయనంలో తేలిందని ఆయన స్పష్టంచేశారు. సుమారు 200 మంది నిలబడే చోట బ్యాగుల కారణంగా వంద మంది నిలబడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో రద్దీ సమయంలో లోపలికెళ్లేందుకు స్థలం లేక బయటే వేలాడాల్సి వస్తోందని అన్నారు.  

మరణాలకూ దారితీస్తోంది! 
లోకల్‌ రైళ్లలో రద్దీ కారణంగా డోరు దగ్గర వేలాడుతున్న వారిలో ప్రతీ రోజు సగటున ముగ్గురు కింద పడి మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు కారణం లోపలికేందుకు చోటు లభించకపోవడమే. సాధారణంగా ఒక్కో లోకల్‌ రైలులో రెండు వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. కానీ, ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఈ సంఖ్య ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది. నడిచే రైలులోంచి కిందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ సమయంలోనే అధికంగా ఉంటుంది. ప్రయాణికుల భుజాలకు బ్యాగులు వేసుకోవడంవల్ల అదనంగా స్థలం ఆక్రమించుకుంటుందని అధికారులు నిర్ధరణకు వచ్చారు. దీంతో ప్రయాణికులు తమ బ్యాగులు భుజాలకు వేలాడదీయకుండా లగేజీ ర్యాక్‌పై పెట్టాలని తరుచూ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. 

అయినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. సీట్లపై కూర్చుండేవారు ర్యాక్‌పై బ్యాగులు పెట్టడంవల్ల ర్యాక్‌లు ఫుల్‌ అవుతున్నాయి. ఇక నిలబడిన ప్రయాణికులు భుజాలపై బ్యాగులు ఉంచుకోక తప్పడం లేదు. దీంతో అదనంగా స్థలం ఆక్రమించుకుంటుంది. సీటు కింద కూడా ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, అక్కడ పెట్టడానికి ముఖం చాటేస్తారు. బ్యాగులు భుజాలకు వేసుకోవద్దని, ర్యాక్‌పై పెట్టాలని, సాధ్యమైనంత వరకు చిన్న బ్యాగులు వెంట తెచ్చుకోవాలని తరుచూ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. కానీ, ముంబైకి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య జనాలతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల్లో అధిక శాతం దూరప్రాంతాల నుంచి వచ్చేవారుంటారు. 

రెండున్నర నుంచి మూడున్నర గంటలు ప్రయాణ సమయం పడుతుంది. దీంతో ఆ బ్యాగుల్లో లంచ్‌ బాక్స్, సాయంత్రానికి అల్పహార బాక్స్, వాటర్‌ బాటిళ్లు, ల్యాప్‌టాప్, ఇతర కీలకమైన పత్రాలు, వర్షా కాలంలో గొడుగు తదితరాలుంటాయి. దీంతో బ్యాగు వెంట తెచ్చుకోవడం మినహా మరో ప్రత్నామ్నాయ మార్గం లేదు. సెంట్రల్, హార్బర్, పశి్చమ మార్గంలోని లోకల్‌ రైళ్లలో నిత్యం రాకపోకలు సాగించే వారిలో దాదాపు వంద మందిలో 90 శాతం ప్రయాణికుల వద్ద బ్యాగులుంటాయి. ఈ బ్యాగుల కారణంగా రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వెంట తీసుకురాక తప్పడం లేదని ప్రయాణికులు అంటున్నారు.  

దొంగతనాలకు ఆస్కారం.. 
లోకల్‌ రైల్వే హద్దులో గడచిన ఆరేళ్లలో ప్రయాణికుల నుంచి రూ.8.28 కోట్లు విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీస్‌ రికార్డుల్లో నమోదైన కేసులను బట్టి తెలిసింది. రైల్వే స్టేషన్లు, రైలు బోగీల్లో రద్దీగా ఉంటుండటంతో దొంగలు కూడా చోరీలు సులువుగా చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ చోరీ సంఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.  షకీల్‌ అహ్మద్‌ షేక్‌ అనే సామాజిక కార్యకర్త 2013 నుంచి 2018 కాలం వరకు లోకల్‌ రైల్వే హద్దులో ఎన్ని చైన్‌ స్నాచింగ్, చోరీ కేసులు నమోదయ్యాయో వివరాలు వెల్లడించాలని రైల్వే పోలీసులను కోరారు. 

వారి రికార్డుల్లో నమోదైన కేసుల్లో మొత్తం రూ.8,28,24,860 విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆరేళ్లలో మొత్తం 2643 కేసులు నమోదుకాగా అందులో 860 పరిష్కరించారు. అదేవిధంగా రైల్వే పోలీసులు నేరస్తుల నుంచి రూ.3,32,39,921 విలువచేసే సొత్తు రికవరీ చేసుకున్నారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా రైల్వే బోర్డు ప్లాట్‌ఫారాలపై, స్టేషన్‌ ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆరీ్పఎఫ్‌), గవర్నమెంట్‌ రైల్వే పోలీసు (జీఆరీ్ప) ఇలా వివిధ పోలీసు దళాలలను మోహరించింది. అయినప్పటికీ నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. కాగా, రైల్వేలో రద్దీ తగ్గితే దొంగతనాలకు చెక్‌పడే అవకాశం సైతం ఉంది. 

డోరువద్ద వేలాడుతు మరణించిన వారి సంఖ్య.. 
(జనవరి నుంచి జూన్‌ వరకు) 
సెంట్రల్‌ రైల్వే మార్గంలో–202 మృతి చెందగా అందులో 184 పురుషులు, 18 మహిళలున్నారు.  
పశ్చిమ మార్గంలో–302 మృతి చెందగా  278 మంది పురుషులుండగా 24 మంది మహిళలున్నారు.  

మరిన్ని వార్తలు