రౌడీషీటర్ దారుణ హత్య

5 Oct, 2016 01:56 IST|Sakshi

కేకే.నగర్: విల్లుపురంలో రౌడీషీటర్ దారుణహత్యకు గురి కాగా, చె న్నైలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. విల్లుపురం జిల్లాలో మంగళవారం బాంబుతో దాడి జరిపి రౌడీని వేటకత్తులతో దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా వానూర్ తాలూకా కుయిలాపాళయం శక్తికోవిల్ వీధికి చెందిన జనార్ధనన్(23) రౌడీషీటర్‌గా చలామణి అవుతున్నాడు.
 
 ఇతనిపై హత్య, కిడ్నాప్ వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జనార్ధనన్ అనుచరులకు, మరొక రౌడీ రాజ్‌కుమార్ అనుచరులకు మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన కొందరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తిరుకోవిలూర్ ప్రాంతానికి చెందిన చెల్లపాండి అనే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ కేసుపై విచారణ విల్లుపురం జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో మగళవారం ఉదయం జరిగింది.
 
 ఈ కేసులో రౌడీ జనార్ధనన్, సురేష్‌లు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం జనార్ధనన్, సురేష్ ద్విచక్ర వాహనాలపై పుదుచ్చేరికి వెళుతున్నారు. ఆ సమయంలో ఐదు మందికి పైగా వ్యక్తులు మోటారు బైకుపై వారిని వెంబడించారు. రైల్వే వంతెనపై వెళుతుండగా వారిపై నాటు బాంబులను విసిరారు. దీనితో వారు అదుపుతప్పి కింద పడ్డారు. సురేష్ స్పల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా జనార్ధనన్‌పై ఆ ముఠా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వెంటనే ఆ ముఠా బైకులపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనార్ధనన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీలో ఉన్న హంతకుల కోసం గాలిస్తున్నారు.
 
అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం : పల్లికరనై సమీపంలోని కోవిలంపాక్కం, తుైరె పాక్కం- పల్లావరం రేడియల్ రోడ్డుపై టాస్మాక్ దుకాణం ఉంది. ఈ దుకాణం సమీపంలోని చెట్టుకు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పల్లికరనై పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో అతడిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? లేక పాతకక్షలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు