-

తులసిచెట్టు చుట్టూ చిన్నమ్మ ప్రదక్షిణలు

23 Feb, 2017 16:40 IST|Sakshi
తులసిచెట్టు చుట్టూ చిన్నమ్మ ప్రదక్షిణలు

జైలుకు అలవాటుపడుతున్న చిన్నమ్మ
జైలు వద్ద మాజీ మంత్రులకు చుక్కెదురు
ఆరునెలల తరువాతనే పెరోల్‌



సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితతో (దాదాపు) సమానంగా గౌరవ మర్యాదలు అందుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన జీవితంలో రెండోసారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినపుడు జయతోపాటూ సుమారు ఆరునెలలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడగా ఈనెల 15వ తేదీ నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పర అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన హోదాను తృటిలో చేజార్చుకున్న శశికళ జీవితంపై సర్వాత్రా ఆసక్తి నెలకొని ఉంది. జైల్లోని ఖైదీల సెల్‌లోకి వెళ్లిన రోజున శశికళ ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా గడిపారు. తనలో దుఃఖాన్ని బైటకు కనపడనీయకుండా జాగ్రత్తపడ్డారు. సుమారు నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదనే సత్యాన్ని ఆకళింపు చేసుకున్నట్లుగా రానురానూ జైలు జీవితానికి అలవాటు పడుతున్నారు. మొదటి రోజున ఆమెకు చాప, రెండు నీలం రంగు చీరలు, చెంబును ఇచ్చారు. ప్రస్తుతం ఇనుప మంచం, రెండు దుప్పట్లు, టీవీ వసతిని కల్పించారు.

ఆధ్యాత్మిక జీవనం: ప్రతిరోజూ తెల్లవారుజాము 5 గంటలకు నిద్రలేచి ఒకగంటపాటు తన సెల్‌లోనే ధాన్యం, 6.30 గంటలకు వేడినీళ్లతో స్నానమాచరించి, జైలు ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయ రాకపోకల్లో ఇళవరసి కూడా శశికళను అనుసరిస్తున్నారు. జయ జైల్లో ఉన్నపుడు ఆలయ ప్రాంగణంలో తులసి చెట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేడు శశికళ అదే మండపం వద్ద పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ తరువాత తమిళం, ఇంగ్లిషు వార్తా పత్రికలు చదువుతున్నారు. ఉదయం 6.30 గంటలకు టిఫిన్‌ తినడం పూర్తి చేసుకుని మధ్యాహ్నం వరకు టీవీని చూస్తూ కాలంగడుపుతున్నారు. సందర్శకులు ఎవరైనా వస్తే వారిని కలుస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు జైల్లో పెట్టే ఆహారాన్ని ఆరగించి,  రాత్రి 10 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆరునెలల తరువాతనే శశికళకు పెరోల్‌ లభించే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య  బుధవారం మీడియాకు తెలిపారు.

మరో జైలుకు శశికళ జైలుమెట్‌ సైనేడు మల్లిక:  జైల్లో శశికళకు కేటాయించిన పక్కసెల్‌లో సైనేడ్‌ మల్లిక (52) అనే మహిళ పలు హత్యల నేరంపై శిక్షను అనుభవిస్తోంది. ఆమెను మరోచోటకు మార్చాల్సిందిగా శశికళ పదే పదే జైలు అధికారులను ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. శశికళ విజ్ఞప్తి మేరకు సైనేడ్‌ మల్లికను బెంగళూరు జైలు నుంచి  బెల్గాం జైలుకు మార్చారు.

మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్‌: ఇదిలా ఉండగా, అదే జైలులోని మగ ఖైదీల వార్డులో ఉన్న సుధాకరన్‌ నిత్యం తరచూ కాళీమాత ఫొటోను ముందు పెట్టుకుని మంత్రాలు చదువుతున్నాడు. దీంతో తోటి ఖైదీలు సుధాకరన్‌ను ఒక మంత్రవాదిగా భావిస్తూ భయపడుతున్నారు. సుధాకరన్‌ను తమ వార్డు నుంచి వేరే చోటికి మార్చాల్సిందిగా జైలు అధికారులను ఒత్తిడి చేస్తున్నారు.

శశికళ వద్దకు చేరిన ఈసీ నోటీసు:  
        
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎంపిక చట్ట విరుద్ధంగా సాగిందంటూ వచ్చిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ జారీచేసిన నోటీసు జైలులోని శశికళకు చేరింది.

మాజీ మంత్రులకు చేదు అనుభవం: శశికళ నియమించిన ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బెంగళూరు జైలుకెళ్లి కలిసిరావాలనే ప్రయత్నించినా ఎం దుకో విరమించారు. టీటీవీ దినకరన్‌ చిన్నమ్మను కలిసివచ్చారు. రాష్ట్ర మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా మంగళవారం బెంగళూరుకు వెళ్లి జైలు అధికారులను లిఖితపూర్వకంగా కోరినా అనుమతి లభించలేదు. కర్ణాటక డీజీపీ నుంచి ఉత్తర్వులు పొందాలని జైలు అధికారులు వారిని నిరాకరించారు.  శశికళ చూసేందుకు అంటూ గుంపులు గుంపులుగా జైలు ముందు చేరితే సహించేది లేదని జైలు అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, శశికళను కలుసుకునేందుకు అగ్రహార జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు పి. వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతిలకు ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం రాత్రి జైలు వద్దకు వెళ్లిన ఈ ముగ్గురిని లోనికి అనుమతించలేదు. దీంతో జైలు పరిసరాల్లో నిల్చుని ఉండగా జైలు సిబ్బంది లాఠీలతో వచ్చి తరిమివేయడంతో పరుగులాంటి నడకతో వారు బతుకు జీవుడా అని అక్కడి నుంచి  బైటపడ్డారు.

మరిన్ని వార్తలు