ఇంక నాశనం చేసుకోలేను

28 Mar, 2015 01:36 IST|Sakshi
ఇంక నాశనం చేసుకోలేను

 అనుభవాలు పాఠాలు నేర్పుతాయంటారు. నటి నయనతారకు మాత్రం చేదు అనుభవాలు చాలా గుణపాఠాలు నేర్పినట్లున్నాయి. ఈభామ మాటల తీరే ఇందుకు ఉదాహరణ. నటుడు శింబుతో ప్రేమ విఫలం తొలి దెబ్బ కాగా నృత్య దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి పెటాకులు ఆమెకు చాలా గుణపాఠాలు నేర్పినట్లున్నాయి. అందుకే నటుడు శింబునైనా క్షమిస్తానుగాని ప్రభుదేవాను మన్నించేది లేదని ఇది వరకే చెప్పారు. నయనతార తమిళంతో పాటు తెలుగులోను పాపులర్ నటి. ఆమెకు టాలీవుడ్‌లోనూ చాలామంది సన్నిహితులున్నారు. ప్రభుదేవాతో ఎక్కువగా సహజీవనం చేసింది హైదరాబాదులోనే.
 
 వీరి ప్రేమకు బ్రేక్ పడి చాలా కాలమైంది. అలాంటిది తాజాగా ఒక కొత్త ప్రచారం జరగడం విశేషం. ఇది ఎంతవరకు నిజమో తెలియదుగాని నయనతారను తనతో మళ్లీ కలపాల్సిందిగా ఒక టాలీవుడ్ నిర్మాతను కోరారట. ఈ విషయంపై ఆయన నయనతారతో సంప్రదించగా ఆమె ససేమిరా అన్నారట. అంతేకాదు తానింకా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం లేదని, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని బదులిచ్చారని కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం తమిళంలో ప్రముఖ నాయికల్లో ఒకరిగా ప్రకాశిస్తున్న ఈ అమ్మడు ఎవరిని మనసులో ఉంచుకుని ఆ మాటలని ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాం.
 

మరిన్ని వార్తలు