హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్ఎస్ నేతల మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అనే కాకి కోదండరాం ను ఎత్తుకుపోయిందని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు బాల్క సుమన్, సీతారం నాయక్, మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య కోదండరాంపై నిప్పులు చెరిగారు. కోదండరాం తీరు చూస్తుంటే ఆయనను కాంగ్రెస్ కాకి ఎత్తుకు పోయినట్లు ఉందన్నారు.
ఉద్యోగం లేని కోదండరాం కొందరు నిరుద్యోగులకు నాయకుడిగా మారిపోయారని.. నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న తరుణంలో కోదండరాం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను లోకమంతా మెచ్చుకుంటుంటే.. మీరు మాత్రం కాంగ్రెస్ ఏజెంట్గా మారిపోయి వాటిని విమర్శిస్తారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. వైఖరి మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.