బీఎస్‌ఎన్‌ఎల్‌ డబుల్‌ ధమాకా

20 Sep, 2017 11:35 IST|Sakshi
టెలికాం మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర పోటీకర పరిస్థితుల్లో, ప్రభుత్వ రంగ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు డబుల్‌ ధమాకా ప్రకటించింది. రెండు ప్రమోషనల్‌ స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్లను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఒకటి రూ.249 స్పెషల్‌ టారిఫ్‌ ఆఫర్‌. ఈ ఆఫర్‌ కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు అన్ని లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌ కాల్స్‌ ఉచితంగా అందించనుంది. ఈ ప్రమోషనల్‌ ఎస్టీవీ 28 రోజుల పాటు వాలిడిటీలో ఉంటుంది. 2017 అక్టోబర్‌ 25 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో  ఉంటుంది. 
 
దీంతో పాటు రూ.429 రీఛార్జ్‌ ప్యాక్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించింది. దీని కింద రోజుకు 1జీబీ డేటా చొప్పున 90 రోజుల పాటు నెట్‌ను అందించనుంది. అంతేకాక ప్రీపెయిడ్‌ వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని ఆఫర్‌ చేయనుంది. జియో రూ.399 ప్యాక్‌కు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రమోషనల్‌ ప్యాక్‌లను తీసుకొచ్చింది. టెలికాం మార్కెట్‌లో జియో తెరతీసిన ధరల యుద్ధంతో డేటా రేట్లు కిందకి దిగిరావడంతో పాటు, కస్టమర్లకు అందించే ప్రయోజనాలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతమున్న కాల్‌ ఛార్జీలు కూడా త్వరలోనే కిందకి పడిపోనున్నాయి. మొబైల్‌ ఇంటర్‌కనెక్షన్‌ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు ట్రాయ్‌ తగ్గించింది. ఈ నేపథ్యంలో కాల్‌ ఛార్జీలు కిందకి పడిపోనున్నట్టు తెలిసింది.   
మరిన్ని వార్తలు