అప్పు చేద్దాం.. ‘రుణం’ తీరుద్దాం

27 Aug, 2014 01:48 IST|Sakshi

రాష్ట్రం ఇంకా 9 వేల కోట్లు అప్పుతీసుకునే అవకాశం 
ఉమ్మడి అప్పుల సర్దుబాటుతో తెలంగాణలో నగదు నిల్వ

 
హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో బ్యాంకులకు కొంతమొత్తాన్ని చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా దాదాపు తొమ్మిదివేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీలు విక్రయించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెచ్చిన అప్పులతోపాటు, వ్యాట్, కేంద్రగ్రాంట్లు, కేంద్రపన్నుల వాటా నుంచి నిధులు వస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల జోలికి వె ళ్లలేదు.

ఈ మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, పోలీసులకు కొత్తవాహనాల కోసం 340 కోట్లు, అలాగే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద 480 కోట్లు, విద్యుత్ సబ్సిడీ చెల్లింపులు మినహా ఇంకే చెల్లింపులు చేయలేదు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అక్టోబర్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అవసరాలకు నగదు నిల్వ ఉన్నందున అప్పుల జోలికి వెళ్లలేదు. కాగా, ఈనెల 31వ తేదీలోగా రైతుల రుణాలపై స్పష్టత వస్తున్నందున. సెప్టెంబర్‌లో బ్యాంకులకు కొంత బకాయిలు చెల్లించక తప్పదు. దీంతో సెక్యూరిటీల విక్రయానికి ఆర్‌బీఐ వద్దకు వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాలు ఒకేసారి సెక్యూరిటీ విక్రయాలకు వెడితే మార్కెట్‌పై భారం అధికం అవుతుందని భావించి రిజర్వ్‌బ్యాంకు కూడా కొంత వ్యవధి ఇచ్చి సెక్యూరిటీలను విక్రయానికి పెడుతుందని ఆర్థికశాఖ వర్గాలు వివరించాయి.
 
 రైతుల వివరాల సేకరణకు  గడువు ఇవ్వండి
 
 రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాల సేకరణ, క్రోడీకరణకు తమకు మరికొంత గడువు కావాలని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని కోరాయి. రుణమాఫీ సమాచార సేకరణలో పురోగతిపై వ్యవసాయశాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  బ్యాంకర్లు ఈ వివరాల సేకరణకు గడువు సరిపోదనీ.. మరికొంత సమయం ఇవ్వాలని కోరగా కమిషనర్ తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 31 నాటికి పూర్తి నివేదిక రావాల్సిందేనన్నారు. గడువు ఇవ్వడం మొదలైతే.. నెల రోజులైనా సరిపోదని ఆయన అన్నట్లు తెలిసింది. ఇచ్చిన గడువు లోగా రేయింబవళ్లు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈనెల 31 నాటికి అపాయింటెడ్ డేట్‌గా అనుకున్నం దున.. ఆ లోగా పూర్తిచేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. రైతులు కొత్త రుణాల కోసం ఎదురు చూస్తున్నారని.. ఆలస్యమైతే వారికి రుణాలందడం కష్టమని, అందుకే శరవేగంగా క్రోడీకరణ పనులు పూర్తిచేయాలని  కోరారు. ఇదిలావుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 167 మండలాల్లో సమాచార సేకరణ పూర్తయిందని జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు