దారిమళ్లిన ‘ఉపాధి’ నిధులు

2 May, 2015 04:39 IST|Sakshi

     గ్రామీణప్రాంతాల్లో
     నిలిచిపోయిన పనులు
     రూ.85.77 కోట్లు వెనక్కి తీసుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ
     ఏడాదైనా విడుదల చేయని వైనం

 
 
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేరాల్సిన ఉపాధి హామీ నిధులు దారిమళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీల్లో సిమెంటు రోడ్లు, కల్వర్టులు, సైడ్ డ్రైయిన్లు, పంచాయితీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం.. తదితర అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామీణాభివృద్ధి విభాగం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేసిన నిధుల్లో పదిశాతం నిధులను ఏడాది క్రితం గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది. తొమ్మిది జిల్లాల్లోని 25 పంచాయితీరాజ్ డివిజన్ల నుంచి తీసుకున్న మొత్తం సుమారు రూ.85.77 కోట్లను ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు.


పాత బకాయిలు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆయా జిల్లాల్లో పనులు చే సి న కాంట్రాక్టర్లు నిధులు రాకపోవడంతో కూలీలకు వేతనాలు చెల్లించడం లేదు. ఈ విషయమై స్థానికంగా ఉండే ఇంజనీర్లను సంప్రదిస్తే గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు ఇవ్వడం లేదంటున్నారని సర్పంచులు వాపోతున్నారు. వెనక్కి తీసుకున్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు దేనికి వినియోగించారో ఎవరికీ అంతుబట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులే వాటిని దారి మళ్లిం చేందుకు పూనుకోవడం పట్ల సర్పంచుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  


అసలు ఏం జరిగింది..?
ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయ తీల్లో చేపట్టిన పనులకు 90 శాతం నిధులను వివిధ దశల్లో కాంట్రాక్టర్లకు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీర్ చెల్లిస్తారు. ఆపై ఆయా పనులను క్వాలిటీ సెల్, సోషల్ ఆడిట్ బృందాలు పరిశీలించి సంతృప్తికర నివేదికలు ఇస్తేనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. అయితే ఏపీ పునర్విభజన ప్రక్రియ సందర్భం లో.. అన్ని డివిజన్ల నుంచి ఇంజనీర్ల ఖాతాల్లో ఉన్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది.


సకాలంలో క్వాలిటీ బృం దాన్ని పనుల పరిశీలనకు అధికారులు పంపకపోవడం, సోషల్ ఆడిట్ బృందాలు పనులను సందర్శించకపోవడంతో కొంత జాప్యమైంది. ఆపై ఆయా బృందాలు పంచాయతీల్లో పర్యటించి సంతృప్తికరమైన నివేదికలు ఇచ్చినా, గ్రామీణాభివృద్ధి విభాగం మాత్రం ఎందుకోగానీ నిధులను తిరిగి వెనక్కి ఇవ ్వలేదు. ఉపాధి హామీ నిధులను దారిమళ్లించి ఉంటారని సర్పంచులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
 

అవమానపడాల్సి వస్తోంది..
ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయితీల ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనులను చిన్నచిన్న కాంట్రాక్టర్లు, కూలీలతో చేయించాం. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో  కాంట్రాక్టర్లు వేరే పనులు చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ము వచ్చి నా.. తాము దాచుకొని ఇవ్వట్లేదేమోనని కాంట్రాక్టర్లు, కూలీలు అపనిందలు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే సర్పం చులకు అవమానాలు తప్పడం లేదు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.    - పురుషోత్తం, మెంటెపల్లి సర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు.

>
మరిన్ని వార్తలు