‘రాహుల్‌ సీట్లు.. చంద్రబాబు నోట్లు’

10 Nov, 2018 19:50 IST|Sakshi

రైతులను కాల్చి చంపిన చంద్రబాబుకు ఓట్లు ఎందుకు వెయ్యాలి

సిరిసిల్ల రైతు సభలో : కేటీఆర్‌

సాక్షి, సిరిసిల్ల :  కరెంట్‌ అడిగితే తెలంగాణ రైతులను కాల్చి చంపిన చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఎందుకు వెయ్యాలని ఆపధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఒక్కటై మీ వేలితోనే మీ కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో శనివారం జరిగిన రైతు కృతజ్ఞత సభలో కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న కేసీఆర్‌కు ఓటు వేస్తారో.. రైతులను చంపిన చంద్రబాబుకు ఓటు​ వేస్తారో ఒక్కసారి ఆలోచించండని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు రాహుల్‌ గాంధీ సీట్లు, చంద్రబాబు నోట్లు ఇస్తున్నారని వారికి సరైన బుద్ది చెప్పాలన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎరువులను పోలీస్‌ స్టేషన్‌కు పోయి తీసుకునే పరిస్థితి ఉందేది. దయలేని ప్రభుత్వంలో రైతుల్ని గంజిలో ఈగలా చూసేవారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతుల స్థితిని మార్చలేక పోయ్యాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెనుకబడిని 80 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేశాం. దాని కోసం కాళేశ్వరం నిర్మాణం చేపట్టాం. కేసీఆర్‌​ రైతులకు చేసిన విధంగా 16 మంది ప్రధాన మంత్రులు కూడా చేయలేకపోయ్యారు. జిల్లాలోని మానేరు డ్యాంను నింపితే సిరిసిల్ల కోనసీమగా మారుతుంది. గోదావరి నీళ్లు తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్‌ నాయకులు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు.

మరిన్ని వార్తలు