ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

30 Jun, 2018 11:44 IST|Sakshi
ఓటు హక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు  

ఖమ్మంలీగల్‌ : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల అధికారులు పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం బార్‌ అసోసియేషన్‌లో మొత్తం 674 ఓట్లు ఉండగా 610 ఓట్లు పోలయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ పర్యవేక్షణలో న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు.

ఎన్నికల అధికారిగా ఖమ్మం బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు వ్యవహరించారు. బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. బార్‌ కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, మర్రి ప్రకాష్, పిడతల రామ్మూర్తి మిగిలిన కార్యవర్గం ఎన్నికల అధికారికి సహకరించారు.

ఈ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది బోడేపూడి రాధాకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు చివరి వరకు తమకు ఓటు వేసే విధంగా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్‌కౌన్సిల్‌లో 86 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఖమ్మం నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు. మొత్తం బార్‌ కౌన్సిల్‌ సభ్యులు 25 మంది ఎంపికకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

స్థానిక అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో వారి భవితవ్యం వచ్చేనెలలో వెలువడనున్న ఫలితాలతో తేలనున్నది. ఎన్నికల అధికారులకు శేఖర్‌రాజు, రామ్మూర్తి, లలిత, మర్రి ప్రకాష్, పవన్, నారాయణ, తౌఫిక్, శ్రీలక్ష్మి తదితరులు సహకరించారు.

కొత్తగూడెంలో 92 శాతం పోలింగ్‌

కొత్తగూడెంలీగల్‌: బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం కొత్తగూడెంలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు అదనపు జిల్లా జడ్జి భువనేశ్వరరాజు పర్యవేక్షణలో ఎన్నికల అధికారి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నిర్వహణలో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 183 మంది ఓటర్లకు గాను 169 ఓట్లు పోలయ్యా యి.

తొలుత సీనియర్‌ న్యాయవాది బొల్లేపల్లి లక్ష్మీనారాయణ ఓటుహక్కు వినియోగించుకోవడంతో పోలింగ్‌ ప్రారంభమైంది. అభ్యర్థులు కొల్లి సత్యనారాయణ, బిచ్చాల తిరుమలరావు, విష్ణువర్దన్‌రెడ్డి, దిలీప్‌కుమార్, ఫణీంద్రభార్గవ్, పంబ వెంక య్య, దావూద్‌ అలీ, జల్లా లింగయ్య తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఒక్కొక్క ఓటరుకు కనీసం 5 నుంచి 7 నిముషాల పాటు సమయం కేటాయించాల్సి వచ్చింది.

వన్‌టౌన్‌ సీఐకుమారస్వామి, సిబ్బంది బందోబస్తు నిర్వí హించారు. అవకతవకలు చోటుచేసుకోకుండా బార్‌ కౌన్సిల్‌ తగిన జాగ్రత్తలు పాటించింది.    పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఉంచారు.

సాధారణ ఎన్నికలు హంగులు, హడావుడితో ఎలా జరుగుతాయో అదేవాతావరణంలో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌లను జూలై 23 నుంచి కౌంటింగ్‌ చేయనున్నట్లు  సమాచారం. బ్యాలెట్‌ల కౌంటింగ్‌లో అభ్యర్థుల ప్రాధాన్యతను గుర్తించడంలో ఎక్కువ సమయం పడుతుండడంతో  కౌంటింగ్‌కు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు