ఏం చేద్దాం చెప్పండి?

12 May, 2020 02:07 IST|Sakshi

కరోనాతో కలసి జీవించే వ్యూహం రూపొందించండి

భవిష్యత్‌ సడలింపులపై ప్రతిపాదనలు ఇవ్వండి

కరోనాపై సమీక్షలో కేసీఆర్‌ సూచన 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, దానితో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ వైరస్‌ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కనుక కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
(చదవండి: ఉచితం అని చెప్పి పెయిడ్ క్వారంటైన్కా..? )

‘కరోనాతో పోరాడుతూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్‌లో సడలింపులను ఎలా అమలు చేయాలి? ఏ జోన్‌లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్‌ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపులు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’ తదితర అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
(చదవండి: జిల్లాల్లో కరోనాసెరో సర్వే)

అత్యుత్తమ సేవలు అందాలి..
‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్‌ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలి. కాంటాక్ట్‌ వ్యక్తులకు పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్‌ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నం’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు