కంటైన్మెంట్ ప్లాన్తో ఎక్కడికక్కడ వైరస్కు ముకుతాడు
అష్టదిగ్బంధంతో కరోనా వ్యాప్తికి చాన్స్ లేనట్టే.. మర్కజ్ కాంటాక్టులు అందరికీ దాదాపు పరీక్షలు పూర్తి
ఇక కేసులు పెద్దగా పెరగవంటున్న వైద్యాధికారులు.. లాక్డౌన్ ముగిసే నాటికి పరిస్థితి అదుపులోకి..!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చినట్టేనని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కంటైన్మెంట్ల (హాట్స్పాట్లు)ను ఏర్పాటు చేయడం ఫలించింది. ఈ ప్రాంతాల పరిధిలోనే పాజిటివ్ కేసులు, వారి కాంటాక్టులు, కుటుంబసభ్యులుండటంతో ఇక వైరస్ ఆయా ప్రాంతాలను దాటి విస్తరించే పరిస్థితి ఉండదని వైద్యాధికారులు భావిస్తున్నారు. కంటైన్మెంట్లున్న ప్రాంతాల్లో ఎవరైనా బయటకు వెళ్లాలన్నా, లోనికి రావాలన్నా ఒకటే దారి ఏర్పాటు చేశారు. ఎందుకు బయటకు వెళ్తున్నారో?, లోనికి వస్తున్నారో నమోదు చేస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లతోనూ నిఘా ఉంచారు. పైగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. మొన్నటి వరకు వైరస్ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందో స్పష్టంగా తెలియలేదు. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య, కాంటాక్టు వివరాల ఆధారంగా ప్రత్యేకంగా కంటైన్మెంట్లను ఏర్పాటు చేయడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాక, కంటైన్మెంట్ల పరిధిలో ఉన్న క్వారంటైన్లోని బాధితులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరి కదలికలపై ఆన్లైన్ నిఘా పెట్టడంతో ఎక్కడికి వెళ్లినా వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకునే వీలు కలిగింది. ఇలా అష్టదిగ్బంధం చేయడంతో వైరస్ వ్యాప్తికి అవకాశాల్లేవని ఓ అధికారి చెప్పారు.
పరిస్థితి నియంత్రణలోకి వచ్చినట్టే!
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇకపై కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారు. మర్కజ్ వెళ్లిన వారిని గుర్తించామని, వారి కాంటాక్టులను, వారి ద్వారా ఇంకెవరైనా కాంటాక్టయ్యారా అనేదీ గుర్తించామని అంటున్నారు. కాబట్టి ఇకనుంచి కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి ఒకట్రెండుసార్లు కేసుల సంఖ్య పెరిగినట్లు కనిపించినా మొత్తంగా కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందని ఆయన చెప్పారు. లాక్డౌన్ పూర్తయ్యే నాటికి కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. ‘ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కడి వరకు వ్యాపించిందో స్పష్టత వచ్చింది. ఆ ప్రకారమే కంటైన్మెంట్ ప్రాంతాలు ఏర్పాటుచేశాం. పైగా ఇతర ప్రాంతాల్లోనూ లాక్డౌన్ అమలవుతోంది. కాబట్టి కేసుల సంఖ్య మునుముందు తగ్గుతుంది’అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జిల్లాలో అధిక కేసులు నమోదయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 30 జీహెచ్ఎంసీ సర్కిళ్లకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టేందుకు సీనియర్ వైద్యాధికారులను నియమించారు. వైరస్ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోనాపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు.
పూర్తయిన ‘మర్కజ్’నమూనాల సేకరణ!
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో అధికారులు నిరాశకు గురయ్యారు. కేసుల సంఖ్య 650కి చేరువకావడం, 18 మంది మృతి చెందడంతో పరిస్థితి అదుపు తప్పిందా అనే సందేహం నెలకొంది. మొదట్లో కేసులు విదేశాల నుంచి వచ్చిన వారితోనే రాగా, ఆపై నమోదైన ఎక్కువ కేసులు ప్రధానంగా మర్కజ్కు వెళ్లొచ్చిన వారితోనే ముడిపడటంతో పరిస్థితి తీవ్రమైంది. మొత్తం 28 జిల్లాలకూ వైరస్ పాకింది. హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో 259 కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటుచేసింది.
ఇందులో మంగళవారం నాటికి 3.01 లక్షల ఇళ్లకు వెళ్లి వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తంగా 12.04 లక్షల మందిని కలిసి వివరాలు సేకరించారు. మర్కజ్కు వెళ్లొచ్చిన వారి కుటుంబసభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్ని ట్రేస్ చేసి పరీక్షలు చేస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేని, మర్కజ్తో సంబంధమున్న వారి నమూనాలను కూడా సేకరించారు. ఇప్పటికే మర్కజ్కు వెళ్లొచ్చిన వారి నమూనాల సేకరణ దాదాపు పూర్తయినట్లే. అక్కడక్కడ కొందరు దాక్కొన్నట్టు అంచనా. వారినీ పట్టుకొంటున్నారు. ఎవరైనా ఈ కంటైన్మెంట్లను దాటి పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎంత సమర్థవంతంగా జల్లెడపడితే ఆ మేరకు ఫలితం ఉంటుందని అంటున్నారు.