అనైతిక వైద్యులపై నిషేధం కొనసాగింపు

8 Jun, 2018 04:47 IST|Sakshi

తెలంగాణ వైద్యమండలి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అనైతిక వైద్యుల ప్రాక్టీసుపై విధించిన నిషేధం కొనసాగుతుందని తెలంగాణ వైద్యమండలి ప్రకటించింది. గతంలో చేపట్టిన విచారణను, జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సదరు వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ వైద్యమండలి బుధవారం బాధితుల వాదనలు వినడమే కాకుండా సద రు వైద్యుల నుంచి వివరణ కోరింది.

అయితే, చికిత్సలకు సంబంధించి సరైన ఆధారాలను వైద్యులు సమర్పించలేదు. దీంతో గతంలో జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని వైద్య మండలి మరోసారి నిర్ణయించిందని చైర్మన్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. గ్లోబల్‌ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డి ఎత్తు పెంపునకు చికిత్స చేసిన ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ చంద్రభూషణ్‌ ప్రాక్టీస్‌ను రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ 2016 నవంబర్‌లో తెలంగాణ వైద్యమండ లి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

చంద్రభూషణ్‌ ప్రాక్టీసుపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. కూకట్‌పల్లిలోని శృతిటెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రత ప్రాక్టీస్‌పై ఐదేళ్లపాటు, అభిప్రాయభేదాలు తలెత్తిన దంపతులకు ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహించి మోసం చేసిన బేగంపేటలోని సైక్రియాటిస్ట్‌ డాక్టర్‌ సోనాకాకర్‌ ప్రాక్టీస్‌పై ఆరు మాసాలు నిషేధం విధించింది. సికింద్రాబాద్‌లోని ఇన్‌ఫెర్టిలిటీ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ మమత దీన్‌దయాళ్, భువనగిరిలోని కస్తూరి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌లకు కూడా హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు