సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల ఉ ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,879 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 27,612కి చేరింది. ఇందులో 11,012 మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 16,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఏడుగురు మృతిచెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 313కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,422 ఉండగా.. రంగారెడ్డిలో 176, మేడ్చల్లో 94, కరీంనగర్లో 32, నల్లగొండలో 31, నిజామాబాద్లో 19, వరంగల్ అర్బన్లో 13, మహబూబ్నగర్లో 11, మెదక్, ములుగు లో 12 చొప్పున, సంగారెడ్డి, సూర్యాపేటలో 9 చొప్పున, కామారెడ్డిలో 7, భూపాలపల్లిలో 6, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెంలో 3 చొప్పున, జగిత్యాల, సిరిసిల్ల, నాగర్కర్నూల్ జిల్లాల్లో 2 చొప్పున, వికారాబాద్, ఆదిలాబాద్, జనగామ, వనపర్తి, సిద్దిపేట్ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 6,220 మందికి పరీక్షలు నిర్వహించగా 4,341 మందికి నెగెటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,438 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,00,826 మందికి నెగి టివ్ వచ్చినట్లు వెద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గ్రేహౌండ్స్లో మరో పదిమందికి..
సివిల్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ విభాగాలను వరసపెట్టి చుట్టేసిన కరోనా వైరస్ ఇప్పుడు గ్రేహౌండ్స్కూ పాకింది. ఈ విభాగంలోని పది మంది తాజాగా వైరస్ బారినపడ్డారు. ఇటీవల గ్రేహౌం డ్స్ సిబ్బంది మావోయిస్టుల వేటలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడ్డారు. వారంతా నగరానికి వచ్చాక పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో వైరస్ బారినపడిన గ్రేహౌండ్స్ సిబ్బంది సంఖ్య 20కి చేరింది. ఇందులో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్నారని సమాచారం. బెటాలియన్లోని ప్రత్యేక బ్యారక్ లో వీరికి చికిత్స అందిస్తున్నారు.