వ్యాపారంపై ‘నోట్ల’ దెబ్బ

25 Nov, 2016 04:15 IST|Sakshi
వ్యాపారంపై ‘నోట్ల’ దెబ్బ
► తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యే
►  యువ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్
 అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకెళ్తోంది
 అంబానీ సోదరుల్లాగే తెలంగాణ, ఏపీ
 విడిపోరుున కొత్తల్లో ఇబ్బందులు పడ్డారు
 ఇప్పుడు ఆర్జనలో బాగున్నారన్న మంత్రి
 ‘తెలంగాణ పరివర్తన’పై ముఖాముఖి
 
సాక్షి, హైదరాబాద్: ‘‘పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణపై కూడా పడింది. అంతటా వ్యాపారం చాలా దెబ్బ తిన్నది’’ అని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరివర్తన (ట్రాన్‌‌సఫామేషన్)పై హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో ‘యంగ్ ఇండియా’ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన ముఖాముఖిలో యువ పారిశ్రామిక వేత్తలతో ఆయన ముచ్చటించారు. సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక, విద్యుత్ రంగాల అభివృద్ధితో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పు చేర్పుల గురించి వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పడిన రెండున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల గురించి వివరించారు. ‘‘హైదరాబాద్‌లో ప్రాంతీయ వివక్ష ఉంటుందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న ప్రచారానికి రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ తెర దించారు. 
 
ఆరు నెలల్లోనే పోలీసులకు అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు. అంతా సవ్యంగా సాగేలా చూశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకుం టున్నది. నాణ్యమైన విద్యుత్ సరఫరా, తగినంత నీరు, కరువు వచ్చినా రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉండి రైతులకు ఉపయోగపడి కనీస అవసరాలు తీరితే రైతన్న కుటుంబంతో పాటు రాష్ట్రమూ అభివృద్ధి బాట పడుతుంది. దీన్ని సాకారం చేసేందుకు కోటి ఎకరాలకు సాగునీరందేలా బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటికీ తాగునీటి కోసం మిషన్ భగీరథ, పచ్చదనం కోసం హరితహారం, పరిశ్రమల అభివృద్ధి కోసం సరికొత్త ఇండస్ట్రీ పాలసీ తెచ్చాం. అనుమతులన్నీ తక్షణం ఇచ్చేలా, ఏ రాష్ట్రం చేయలేని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 
 
 అంబానీ సోదరులు కూడా విడిపోయాక తొలినాళ్లలో కాస్త ఇబ్బందిపడ్డారు. క్రమేణా ఇప్పుడు ఆస్తుల సంపాదనలో బాగున్నారు. ఏపీ, తెలంగాణకు కూడా ఇదే వర్తిస్తుంది. విభజనతో తెలంగాణ, ఏపీలకు మేలే జరిగింది. ఏపీలో గన్నవరం విమానాశ్రయం, ఐఐటీల వంటివి చాలానే కేంద్రం నుంచి వచ్చాయి. భవిష్యత్‌లోనూ మంచి ఫలితాలే ఉంటాయి’’ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లు, జంక్షన్లు, జీబ్రా క్రాసింగ్ లైన్లు, పాఠశాలల్లో పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
 
తెలంగాణ అంబాసిడర్లుగా పనిచేయండి
యువత తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసి దేశ విదేశాల్లోని తమ స్నేహితులు, పారిశ్రామికవేత్తలను ఇక్కడికి రప్పించాలని కేటీఆర్ కోరారు. సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాము లు కావాలని సూచించారు. ‘‘వీలైతే హైదరాబాద్‌లో ఓ డివిజన్‌ను దత్తత తీసుకొని సమస్యలు పరిష్కరించండి. తర్వాత దాన్ని మిగతా ప్రాంతాలకూ విస్తరిద్దాం. ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాష్ట్రం. అందుకే వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయా లు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణముందని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, యంగ్ ఇండియా ప్రతినిధులు చంద్రశేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు