కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు:  వేముల ప్రశాంత్‌రెడ్డి

3 Dec, 2018 15:10 IST|Sakshi
అమీర్‌నగర్‌లో నాగలి బహూకరిస్తున్న రైతులు 

సాక్షి, కమ్మర్‌పల్లి: కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలు కాంగ్రెస్‌ పాలనలోని రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆచరణకు నోచుకోని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని చెబుతున్నా కాంగ్రెసోళ్ల మాయ మాటలను నమ్మవద్దని సూచించారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలం అమీర్‌నగర్, ఇనాయత్‌నగర్, నర్సాపూర్‌ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మోసపూరితమైన హామీలు కాబట్టే అక్కడ అమలు చేయడం లేదన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో గ్రామాలు అంధకారంలో మగ్గాయని, ఇక్కడి నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్‌ కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశారన్నారు. అనంతరం స్థానిక మున్నూర్‌ కాపు సంఘం సభ్యులు ప్రశాంత్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానం కాపీని అందజేశారు. నాగలి, పసుపు దుంపలను అందజేశారు. నాయకులు భాస్కర్‌యాదవ్, లుక్క గంగాధర్, గంగం గంగారెడ్డి, ఆకుల రాజన్న, బెజ్జారపు రాంచందర్, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈవీఎంపై అవగాహన

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలో ఆదివారం వేముల ప్రశాంత్‌రెడ్డి నమూనా ఈవీఎంతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అమీర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్తున్న ఆయన కమ్మర్‌పల్లిలో కొద్దిసేపు ఆగారు. ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలో వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రశాంతన్న యూత్‌ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తేజ, మైలారం బాలు పాల్గొన్నారు.

 ప్రశాంత్‌రెడ్డికి వివిధ సంఘాల మద్దతు

భీమ్‌గల్‌: వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆదివారం మండలంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముచ్కూర్‌ ముదిరాజ్‌ సంఘ సభ్యులు, భీమ్‌గల్, బాబాపూర్‌ ఖురేషి సంఘ సభ్యులు ప్రశాంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు.

 వన్నెల్‌(బి)లో..

బాల్కొండ: మండలంలోని వన్నెల్‌(బి)లో ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు పూర్తయితే వరద కాలువలో ఏడాదంత నీరు నిల్వ ఉండి భూగర్భజలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు.  నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కోటాపాటి నరసింహనాయుడు, రమేశ్‌రెడ్డి, రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌లో చేరిక

మోర్తాడ్‌: బాల్కొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వడ్యాట్‌కు చెందిన వివిధ కుల సంఘాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యం అని వడ్యాట్‌కు చెందిన వివిధ కుల సంఘాల సభ్యులు పేర్కొన్నారు. వారికి కండువాలను కప్పిన ప్రశాంత్‌రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. మహిపాల్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు