పాత పద్ధతిలోనే ఎంసెట్ ర్యాంకులు: కడియం

18 May, 2015 02:50 IST|Sakshi
పాత పద్ధతిలోనే ఎంసెట్ ర్యాంకులు: కడియం

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న విడుదల చేయనున్న ఎంసెట్ తుది ర్యాంకులను పాత పద్ధతిలోనే వెల్లడిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీనిచ్చాకే తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. టెన్త్ ఫలితాలను విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఏపీలో ఇంటర్ ఫలితాలు పెరిగినందున జేఈఈ మెయిన్ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానంలో ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎంసెట్‌ను కొనసాగించేదీ లేనిదీ తర్వాత ఆలోచిస్తామన్నారు.
 
 ‘ఎంసెట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంచుకునే విధానం ఉంది. ఎంసెట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. మరోవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కంటే ఎంసెట్‌లో అర్హత సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇంజనీరింగ్‌కు ఎంసెట్ అవసరమా అన్న వాదనలు ఉన్నాయి. దీనిపై తర్వాత ఆలోచిస్తాం. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ఆ తర్వాత వర్సిటీలకు వైస్‌ఛాన్స్‌లర్లను నియమిస్తాం’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు