లెక్క చెప్పాల్సిందే..

16 Nov, 2018 12:32 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గరిష్ట ఖర్చు రూ.28 లక్షలు

బ్యాంకు ఖాతాతోనే ఖర్చు చేయాలి

పోలింగ్‌ ముగిసేలోపు మూడుసార్లు లెక్క చూపాలి

మార్గదర్శకాలు ఖరారు చేసిన ఎన్నికల కమిషన్‌

ఎన్నికలంటేనే బోలెడంత ఖర్చు. అయితే ఆ ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితి దాటొద్దు అంటోంది ఎన్నికల కమిషన్‌. వెచ్చించే ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందేనంటోంది. ఖర్చు చేసే మొత్తాన్ని కూడా నిర్దేశించింది. అంతేకాదు అభ్యర్థి దేనికెంత వెచ్చించాలో కూడా హద్దులు గీసింది. హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అభ్యర్థి ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా నుంచే ఆ మొత్తాన్ని తీయాల్సుంటుంది. ప్రతీ అభ్యర్థి పోలింగ్‌ ముగిసే లోపు మూడుసార్లు వివరాలను బిల్లులతో సహా సమర్పించాలి. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసాను లెక్కించనున్నారు.      

సాక్షి, నారాయణఖేడ్‌ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. టికెట్‌ దక్కిన వారు ప్రచారంలో నిమగ్నం కాగా మరికొందరు టికెట్ల వేటలో ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అభ్యర్థులు తమ విజయం కోసం చేసే ఖర్చుల పద్దు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అన్న మొత్తాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతీ అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఆదేశించింది. వాహనాలు, భోజనాలు, పార్టీ జెండాలు తదితర వస్తువులకు లెక్కలు రూపొందించింది. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసా లెక్కించనున్నారు.

బ్యాంకు ఖాతాతోనే ఖర్చు..
అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్‌ పేరున బ్యాంకులో జాయింట్‌ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత డబ్బు అయినా, పార్టీ, లేదా దాతలు ఇచ్చిన డబ్బులు అయినా సరే అందులోనే వేసి రోజువారీగా డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు కూడా రూ.28లక్షలకు మించకూడదు. అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అధికారులు ప్రతీ అభ్యర్థికి ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఒక పేజీలో నగదు వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాలోని నిల్వ, మూడో పేజీలో ఖర్చుల వివవరాలు రాయాలి. అభ్యర్థి లేదా అతను నియమించుకొన్న ఏజెంట్‌ ఏ రోజుకారోజు ఆ వివరాలను ఆ పుస్తకంలో రాయాల్సి ఉంటుంది. 

మూడు సార్లు లెక్కచూపాలి.. 
ప్రతీ అభ్యర్థి పోలింగ్‌ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్‌ విభాగంలో సమర్పించాలి. వీటి ఆధారంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకు వస్తే వారు ఆ ఖర్చును అభ్యర్థి ఖర్చు ఖాతాలో రాసి లెక్కిస్తారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబందించిన లెక్కలు చూపనట్టయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దుచేసే అధికారికి ఉంటుంది. 

ప్రతీ అభ్యర్థి పోలింగ్‌ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్‌ విభాగంలో సమర్పించాలి. వీటి ఆధారంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకు వస్తే వారు ఆ ఖర్చును అభ్యర్థి ఖర్చు ఖాతాలో రాసి లెక్కిస్తారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబందించిన లెక్కలు చూపనట్టయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దుచేసే అధికారికి ఉంటుంది. 

మాధ్యమాల ఖర్చు లెక్కలోకే.. 
పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తల ఖర్చులను అభ్యర్థుల ఖర్చు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ ఖర్చులను పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్‌ సెల్‌ వీటిని పర్యవేక్షిస్తుంది.  

ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయించిన ఖర్చుల రేట్లు.. 
లైడ్‌ స్పీకర్, ఆంప్లిఫైర్, మూక్రోఫోన్‌ రోజుకు రూ.800 

బహిరంగ సభ వేధిక రూ.2,500 

ప్లాస్టిక్‌ కటౌట్‌ ఏర్పాటుకు రూ. 5 వేలు, వాల్‌పోస్టర్‌కు రూ.10, ప్లాస్టిక్‌ జెండా రూ.8, కొత్త జెండా రూ.12 

హోర్డింగ్‌ ఏర్పాటుకు రూ.15వేలు, హోర్డింగ్‌ ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతికి రూ.500 

చెక్కతో తయారు చేసిన కటౌట్‌ రూ.5వేలు 

ఫోటో, వీడియో గ్రాఫర్‌కు రోజుకు రూ.3వేలు 

స్వాగత ద్వారా ఏర్పాటుకు రూ.2,500, టెంట్‌ సైజును బట్టి( రూ.400 నుండి రూ.800 

కార్పెట్‌ రూ.250, సైడ్‌వాల్‌ రూ.80, 

భోజనం చేసే విస్తర్లు (ప్లేట్లు) రూ.3, టీ రూ.6, టిఫిన్‌ రూ. 15

విశ్రాంతి తీసుకునే ఇంటి అద్దె రూ. 2 వేలు, 

టోపీ రూ.50, కండువా రూ.10, ఎన్నికల గుర్తుతో ఉన్న టీ షర్టు రూ.150

డ్రైవర్లకు రోజుకు రూ.800

రోజుకు రూ.1,600, టెంపో, ట్రాక్టర్‌కు రూ.2,500, కారుకు రూ.3వేలు, సుమో, క్వాలీస్‌కు రూ.3,500, ఆటోకు రూ.1000, రిక్షా, మోటారు సైకిల్‌కు రూ.500

మరిన్ని వార్తలు