ఆ క్షేత్రం నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయమే..! 

9 Nov, 2018 13:13 IST|Sakshi

 సాక్షి, ధర్పల్లి (నిజామాబాద్‌): రామడుగు ప్రాజెక్ట్‌ గ్రామ శివారులోని హరిహర క్షేత్ర ఆలయం నుంచి పార్టీల అభ్యర్థులు ప్రచార సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. 2004లోని అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేశ్‌పల్లి గంగారెడ్డి ఇదే హరిహర క్షేత్ర ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ప్రచార సెంటిమెంట్‌లోని హరిహర క్షేత్రం నుంచే మండలంలోని మొదటి సారిగా పూజలు నిర్వహించి, ర్యాలీ తీయడంతోనే ఎన్నికల్లో గెలిచానని అప్పట్లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎమ్మెల్యే హోదాల్లో ఏర్పాటు చేసిన సభలో చెప్పేవారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో దిగిన బాజిరెడ్డి గోవర్ధన్‌ హరిహర క్షేత్ర ఆలయం నుంచే ప్రచార ర్యాలీ నిర్వహించి 26 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో దిగిన మాజీ తాజా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇటీవల రామడుగు ప్రాజెక్ట్‌ గ్రామంలోని హరిహర క్షేత్రంలోని పూజలు చేసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడు వనవాసం చేసిన రోజుల్లో ఇదే బాటగా వెళుతూ ఈ ప్రాంతంలోని శివలింగాన్ని తయారు చేసిన ప్రతిష్ఠించి శ్రీరాముడు పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదే శివలింగం పక్కనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి ఏ పని మొదలు పెట్టిన విజయం వరిస్తుందని ప్రజల్లో నమ్మకం ఉంది. ఇదే నమ్మకంతో ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు సైతం ప్రచార సెంటిమెంట్‌గా వాడుతున్నారు.

>
మరిన్ని వార్తలు