ఈవీఎంలతో చెల్లని ఓట్లకు చెల్లు

17 Nov, 2018 09:31 IST|Sakshi

సాక్షి, కాజీపేట: బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ ఉన్నప్పుడు చెల్లని ఓట్ల శాతం అధికంగా ఉండేది. బ్యాలెట్‌ పత్రాలపై స్వస్తిక్‌ ముద్రతో ఓటు వేసేవారు. అప్పుడు ఓటు రెండు గుర్తులపై పడడం, సరిగ్గా ముద్ర పడకపోవడం, ఓటు వేయకుండానే ఖాళీ బ్యాలెట్‌ పత్రాలను బాక్స్‌ల్లో వేసేవారు. ఇలాంటి వాటిని అధికారులు చెల్లని ఓట్లుగా పరిగణించేవారు. గతంలో పలు సందర్భాల్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మెజార్టీ కన్నా చెల్లని ఓట్లే అధికంగా ఉన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. సాంకేతికత పెరగడంతో ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు ఈవీఎంలను ప్రవేశపెట్టాయి.

ఈవీఎంల రంగప్రవేశంతో చెల్లని ఓట్లు లేకుండాపోయాయి. ప్రస్తుతం ఈవీఎంల్లో తాము ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి ఫొటో లేదా గుర్తుకు ఎదురుగా మీటను నొక్కితే సరిపోతుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాను ఎంచుకోవచ్చు. దీంతో చెల్లని ఓట్లు ఉండడం లేదు. నేడు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మాత్రమే బ్యాలెట్‌ పేపర్లు ఇస్తున్నారు.  

మరిన్ని వార్తలు