అందుకే ఆయన రాజన్న అయ్యాడు

8 Jul, 2018 11:29 IST|Sakshi

తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి కొనియాడారు. దేశంలో ఏ ఒక్కనేత అందించని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సాఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే, ఆయన్ను రాజన్న అని పిలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు.

తెలంగాణ అభివృద్ధిని అప్పటి వరకూ పాలకులు విస్మరిస్తే, కేవలం ఒక్క వైఎస్సార్‌ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు రెండు రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు, ఉచిత విద్యుత్‌, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాణహిత, పాలమూరు రంగారెడ్డి పథకాలు పేర్లు మార్చినా వాటికి పునాదులు వేసింది మాత్రం వైఎస్సారే అని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు