తెలంగాణలోనే ‘హీరో’ యుూనిట్!

11 Jul, 2014 16:01 IST|Sakshi

హైదరాబాద్: ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమ ‘హీరో’ సంస్థ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. హైదరాబాద్ శివారులోని రావిరాలలో ఈ యుూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, రావిరాలలో భూమిని కేటాయించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. రూ.1,250 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి హీరో సంస్థ నిర్ణయించుకుంది.

 

అయితే ఈ పరిశ్రమను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాహనాల డీలరుగా ఉన్న టీడీపీ నేత ఒకరు హీరో సంస్థ ఉన్నతస్థాయి వ్యక్తులపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అయితే తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి హీరో సానుకూలంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ కీలకనేత ఒకరు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు