హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్రను సృష్టిస్తున్నారని టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పద్మ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని, ప్రధాని కలిస్తే కేసులు మాఫీ అవుతాయని మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. అసలు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల తరుపున పోరాటం చేసే క్రమంలో రాష్ట్రపతిని, ప్రధాని కలిస్తే.. కేసులు మాఫీ అవుతాయా?అంటూ నిలదీశారు.
ముందు కేసుల మాఫీ సంగతిని పక్కకు పెట్టి.. మీరిచ్చిన రుణమాఫీని అమలు చేయాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. గత టీడీపీ హయాంలో జరిగిన హత్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని పద్మ సూచించారు.