హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...

8 Mar, 2018 17:21 IST|Sakshi
సుల్తానా దంపతులు (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్‌ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్‌ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది.

సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు