మహబూబాబాద్ : జిల్లాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లా కేంద్రం తోపాటు నూతనంగా మునిసిపాలిటీలుగా ఏర్పడిన డోర్నకల్, మరిపెడ, తొర్రూరులో రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. క్రయ విక్రయదారులతో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కిటకిటలాడుతోంది. జిల్లా కాకముందు రూ.23 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా సగం కూడా పూర్తికాని రిజిస్ట్రేషన్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆరు నెలల కాలంలో రూ.8కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జిల్లాలోని 16 మండలాలు ఉన్నాయి. జిల్లా ఏర్పాటుకు ముందు 2012–13 సంవత్సరంలో రియిల్ ఎస్టేట్ భూమ్ పెరిగింది. ఒక్కసారిగా విపరీతంగా ధరలు పెరిగాయి. అప్పులు చేసి మరీ భూములు కొనుగోలు చేశారు. ఆతర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. దీంతో చాలామంది రోడ్డున పడ్డారు. కొందరు బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది.
నవంబర్ 1 నుంచి మళ్లీ ఆన్లైన్ విధానం...
భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాబ్ బుకింగ్ చేసుకునే సౌకర్యం నవంబర్ నుంచి మరోసారి కల్పించనున్నారు. గతంలో ఈ విధానాన్ని ప్రారంభించగా సక్సెస్ కాకపోవడంతో నిలిపివేశారు. మళ్లీ నవంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. రోజూ18 దస్తావేజులు బుక్ చేసుకునే అవకాశం ఉండగా,చేసుకున్న వారికి అదేరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజులు అందించనున్నారు.
శాశ్వత కలెక్టరేట్కు శంకుస్థాపన తర్వాత...
సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయం, మునిసిపాలిటీ నూతన భవనాలకు ఈ ఏడాది ఏప్రిల్ 4న మంత్రి హోదాలో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కురవి రోడ్లో సర్వే నంబర్ 255/1లో 20.30 ఎకరాల భూమిని కేటాయించగా శనిగపురం రోడ్లో ఎస్పీ కార్యాలయానికి 13.25 ఎకరాలు కేటాయించి భవన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కలెక్టరేట్ రోడ్లో రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎకరం రూ.కోటి ఉండగా ఇప్పుడు రూ.2కోట్లకు పెరిగింది. మెయిన్రోడ్లో గజం రూ.20 వేల పైనే ఉంది. ఈ రోడ్లో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. శనిగపురం రోడ్లో ఎస్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణం వల్ల చాలామంది భూములు కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు కురవి రోడ్, శనిగపురం రోడ్ నుంచి మరో జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నందున భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మరిపెడ, డోర్నకల్, తొర్రూరులోనూ...
మరిపెడ, డోర్నకల్ మునిసిపాలిటీలుగా ఏర్పాటు కావడంతో అక్కడ కూడా ఎకరం ధర రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పెరిగింది. తొర్రూరులో రూ.కోటి వరకు ధర పలుకుతోంది. ఆయా ప్రాంతాల్లోనూ మెయిన్రోడ్కు గజం రూ.10వేల నుంచి రూ.15 వేల మధ్య, ఆతర్వాత ఉన్న భూమికి గజం రూ.4వేల నుంచి రూ.5వేల మధ్య నడుస్తోంది.
గతంలో కంటే ఆదాయం పెరిగింది..
గతంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ 2017–18 సంవత్సరంలో 9,328 రిజిస్ట్రేషన్లు కాగా సుమారు రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 47శాతం ఆదాయం పెరిగింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– హరికోట్ల రవి, సబ్ రిజిస్ట్రార్, మహబూబాబాద్
మానుకోట పట్టణ శివార్లలో...