సైబర్‌ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష

19 Mar, 2019 02:31 IST|Sakshi
సైబర్‌ రక్షక్‌ల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, జస్టిస్‌ ఈశ్వరయ్య, జితేంద్ర, ఐజీ స్వాతీ లక్రా. చిత్రంలో రాచమల్ల అనిల్, శ్రీరామ్‌ తదితరులు

సైబర్‌ రక్షక్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో సైబర్‌ రక్షక్‌ సైనికుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో అన్నీ డిజిటలైజ్‌ అయ్యాయని, ప్రస్తుతం మనమంతా ప్రతీ పనికి ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలు చిన్నారుల రక్షణకు నగరంలో ప్రారంభించిన షీ టీమ్స్‌ మంచి ఫలితాలనివ్వడంతో రాష్ట్రమంతా విస్తరించామని గుర్తుచేశారు.

సైబర్‌ నేరాలపై ఎండ్‌ నౌ స్వచ్ఛంద సంస్థ సైబర్‌ రక్షక్‌ల చేత సమాజాన్ని చైతన్య పరచడం అభినందనీయమన్నారు. యువత, తల్లిదండ్రుల్లో మార్పు కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎండ్‌ నౌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్ల, ఇతర సభ్యులను అభినందించారు. అంతకుముందు జస్టిస్‌ ఈశ్వరయ్య, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్, అడిషనల్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్‌ జితేంద్ర, ఐజీ స్వాతీ లక్రా, ఎస్పీ (సీఐడీ) సుమతి తదితరులు సైబర్‌ నేరాల నియంత్రణ, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. అనంతరం సైబర్‌ రక్షక్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

>
మరిన్ని వార్తలు