-
సాక్షి, కొత్తగూడెం: నాలుగు మండలాల్లో శనివారం మండల పరిషత్ కో ఆప్షన్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రజత్కుమార్ శైనీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన 20 మండలాలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 16 మండలాల్లోనే ఎన్నికలు జరిగాయి. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డ విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికలు వాయిదా పడగా, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా నాలుగు మండలాలు ఉన్నాయి. వాటిలో నేడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆళ్లపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోగా.. గెలిచిన నలుగురు ఎంపీటీసీలూ ఎంపీపీ పదవి ఆశిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో శిబిరాలు పెట్టారు. నేరుగా ఎన్నిక సమయానికి ఎంపీటీసీలు రానున్నారు. ములకలపల్లిలో కూడా క్యాంప్ రాజకీయం జోరుగా సాగుతోంది.
ఎంపిక షెడ్యూల్ ఇలా...
15వ తేదీన ఉదయం 9 గంటలకు కో–ఆప్షన్ సభ్యులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్లు స్క్రూట్నీ చేయనున్నారు. 12 గంటలకు అర్హులైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 1 గంటకు కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎంపికైన కో–ఆప్షన్ మెంబర్ల పేర్లు ప్రకటించి, తరువాత మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.