-

కాంగ్రెస్‌ది సుల్తాన్ పరిపాలన.. బీఆర్‌ఎస్‌ది నిజాం పాలన: మోదీ

26 Nov, 2023 17:12 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఈటలకు బయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తూప్రాన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 26/11 దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోదీ చెప్పారు. చేతకాని అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని మోదీ అన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసమా? అంటూ తెలుగులో మాట్లాడిన మోదీ.. దుబ్బాక, హుజూరాబాద్‌లో ట్రైలర్ చూశారు.. ఇకపై సినిమా చూస్తారని అన్నారు.

బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించింది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.

కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచన అంతా..
పదేళ్లుగా బీఆర్‌ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ది సుల్తాన్ తరహా పాలన.. బీఆర్‌ఎస్‌ది నిజాం పరిపాలన అని దుయ్యబట్టారు. నమ్మకద్రోహం తప్పా.. బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి చింత లేదని ప్రధాని మోదీ అన్నారు. తన కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచన అంతా అని చెప్పారు. రాష్ట్రంలో కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

నిర్మల్‌లో బొమ్మల పరిశ్రమను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. నిజామాబాద్ పసుపు బోర్డు హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అంటే.. పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను కేసీఆర్ అడ్డుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని అన్నారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారు: అమిత్ షా

మరిన్ని వార్తలు