స్వీయ నిర్భంధంలో టీఆర్‌ఎస్‌ అసమ్మతి​ నేత

11 Sep, 2018 11:28 IST|Sakshi
చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు(ఫైల్‌ ఫోటో)

సాక్షి, మంచిర్యాల:  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్‌ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని చెన్నూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్‌ టికెట్‌ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై నిరసన గళం తీవ్రం చేశారు.

అందులో భాగంగా మంగళవారం తన ఇంట్లో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. చెన్నూర్‌ టికెట్‌ ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇస్తేనే తలుపులు తీస్తానని స్పష్టం చేశారు. 24 గంటల్లో తనకు సానుకూల స్పందన రాకపోతే జరిగే పరిణామాలకు కేసీఆర్‌ బాధ్యత వహించాలని నల్లాల ఓదెలు హెచ్చరించారు. ఓదెలు చర్యతో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఓదెలు ఇంటికి చేరుకొని బయటకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

టికెట్‌ కోసం నిరాహారదీక్ష
టీఆర్‌ఎస్‌ పార్టీ తన భర్తకు టికెట్‌ కేటాయించాలని స్థానిక కార్పోరేటర్‌ నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త పన్నాల హరీష్‌ చంద్ర రెడ్డికి టీఆర్‌ఎస్‌ పార్టీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలంటూ కావ్య హరీష్‌ చంద్ర రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. కావ్య హరీష్‌ చంద్ర రెడ్డి బాలాజీ నగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ కావడం విశేషం.   

మరిన్ని వార్తలు