ఇంటర్‌ విద్యపై సందిగ్ధం

24 Apr, 2018 12:19 IST|Sakshi

ఆదేశాలు ఇవ్వని విద్యాశాఖ

గురుకులాల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ   

ఆయోమయంలో కస్తూర్బా గాంధీ విద్యార్థినులు

నిజాంసాగర్‌: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌ చదువులపై విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది. రెండు, మూడు రోజుల్లో పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యే కస్తూర్బా విద్యార్థినులు ఇంటర్‌ చదువులకు ఎటువైపు వెళ్లాలన్న ఆయోమయంలో ఉన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌ చదువులను ప్రారంభిస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఇంత వరకు ఆదేశాలు ఇవ్వలేదు.

2009 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తడ్వాయి, సదాశివనగర్, గాందారి, బాన్సువాడ, బీర్కూర్, కామారెడ్డి, బిక్కనూర్, మాచారెడ్డి, దొమకొండ మండలాల్లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. ఆయా కస్తూర్బా విద్యాలయాల నుంచి ఇప్పటి వరకు 7 బ్యాచ్‌ల్లో విద్యార్థినులు పదోతరగతి పరీక్షలు రాశారు. పదోతరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. దాంతో కస్తూర్బాల్లో విద్యాప్రమాణాల పెంపుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యను అమలుకు విద్యా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  కాని స్పష్టమైన ఆదేశాలు జారికాలేదు.

గురుకులాల్లోఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
2018–19 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మిడియట్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఆయా మం డలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మిడియట్‌ ఆడ్మిషన్ల కోసం విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాని జిల్లాలోని 17 కస్తూర్బా విద్యాలయాల నుంచి 628 మంది విద్యార్థినులు పదోతగతి పరీక్షలు రాశారు. కస్తూర్బాల్లో ఇంటర్‌ విద్యను అమలు చేస్తే చాలా మంది చదువుల కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.  

ఆదేశాలు రాలేదు– కుంతల, జిల్లా అధికారిణి
కసూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యబోధన అమలుపై ఇంత వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. జిల్లాలోని రెండు విద్యాలయాల్లో మాత్రం ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమాచారం రాలేదు. 

మరిన్ని వార్తలు