పంచాయతీలకు ఊరట

30 Dec, 2014 23:56 IST|Sakshi

ఇందూరు : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామపంచాయతీలకు ఊరట లభించింది. 13వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా బేసిక్ గ్రాంటు క్రింద జిల్లాకు ప్రభుత్వం రూ. 11.04 కోట్లను మంజూరు చేసింది. ఇందులో నుంచి 20 శాతం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపుల కోసం వాడుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన కరెంటు బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు సర్కారుపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు.

13వ ఆర్థిక సంఘం నిధులలోంచి కొన్ని నిధులు వాడుకోవచ్చని 25 రోజుల క్రితం ప్రభుత్వం సూచించింది. తాజాగా నిధులను కూడా కేటాయించడంతో బకాయిల విషయంలో సర్పంచులకు కాస్త ఊరట లభించింది. రెండున్నరేళ్లుగా పం చాయతీల కరెంటు బిల్లుల భారం పంచాయతీలపైనే పడిం ది. బకాయిలు రూ.117 కోట్లకు చేరడంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. గ్రామాలు అంధకారంలో మునిగే పరిస్థితి ఏర్పడింది. ఇపుడు ప్రత్యేక నిధులను కేటాయించడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విడుదల అయిన నిధులను అన్ని పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ట్రెజరీ శాఖ ద్వారా అధికారులు సర్దుబా టు చేయించి, పంచాయతీల ఖాతాలలో జమ చేశారు. ప్రస్తుతం మంజురు చేసిన నిధులే కాకుండా, పంచాయతీలలో ఇదివరకు నిలువ ఉన్న నిధులలో నుంచి కూడా 20 శాతం కరెంటు బిల్లుల కోసం వాడుకోవచ్చని కలెక్టర్ సూ చించారు. వీలైనంత త్వరగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, ఖర్చు చేసిన నిధుల వివరాలను డీఎల్‌పీఓ కా  ర్యాలయాలలో తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నా రు. విద్యుత్ బకాయిలకు ఉపయోగించగా మిగిలిన నిధు లు, సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, సాలిడ్ పేస్ట్ మేనేజ్‌మెంట్, జీపీ బిల్డింగ్ నిర్వహణ, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగన్‌వాడీలలో పారిశుద్ద్య పనుల కోసం వినియోగించాలని ఆదేశాలిచ్చారు.

>
మరిన్ని వార్తలు