మోగిన సైరన్‌

10 Apr, 2020 10:36 IST|Sakshi
మలక్‌పేటలో బారికేడ్లు...

‘కంటైన్మెంట్‌’ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

ఇంటింటి సర్వేలో అధికార యంత్రాంగం

కరోనా కట్టడికి కఠిన చర్యలు

నగరంలో కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాలలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు ఆయా ప్రాంతాల బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటినీ సర్వే చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతుండగా, కరోనా
అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.  

గోల్కొండ: కంటైన్మెంట్‌ ప్రాంతంగా గుర్తించబడిన మల్లేపల్లిలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌  పర్యటించారు. కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించబడ్డ బడీమసీదు, దాని పరిసరాలలో ఆయన పర్యటించి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను, సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ల వివరాలు, మర్కజ్‌కు హాజరై వచ్చిన వారి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసి పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

రాంగోపాల్‌పేట్‌: జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ ముకుంద్‌రెడ్డిలు రాంగోపాల్‌పేట పరిసరాలను గురువారం పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఆరోగ్యశాఖ సంయుక్తంగా కలిసి ఇంటింటి సర్వే చేపట్టారు. మొత్తం1550 ఇళ్లను సర్వే చేస్తున్నారు. కరోనా అనుమానితులను గుర్తించి వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

అల్వాల్‌: అల్వాల్‌ పోలీస్టేషన్‌లోని పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, వస్తే వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్‌ అడిషనల్‌ క్రైమ్‌ డీసీపీ ఇందిర అన్నారు. గురువారం అల్వాల్‌లో తనిఖీలు నిర్వహించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. హస్మత్‌పేట, రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీ, జానకినగర్, చంద్రపురి కాలనీలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.

కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌ను కంటైన్మెంట్‌ క్లస్టర్‌లో చేర్చడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, వైద్యాధికారులు, గాజుల రామారం సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్లు గురువారం కుత్బుల్లాపూర్‌లోని రోడామేస్త్రినగర్, చంద్రగిరినగర్, చింతల్, షాపూర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

శామీర్‌పేట్‌: మండల పరిధిలోని తుర్కపల్లిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి సమీపంలోని ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించి 44 మంది కరోనా అనుమానితులను బుధవారం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. కాగా గురువారం తుర్కపల్లి గ్రామంలో 50 మంది వైద్య బృందంతో ఇంటింటి సర్వే చేస్తూ, కరోనా పరీక్షలు నిర్వహించారు. 

గోల్కొండ: షేక్‌పేట్‌ డివిజన్‌లోని అజీజ్‌బాగ్, అరవింద్‌నగర్, ఐఏఎస్‌ కాలనీ, బృందావన్‌ కాలనీలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ఏరియాలుగా ప్రకటించింది. గురువారం గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులు ఈ కాలనీలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

యాకుత్‌పురా: చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సర్కిల్‌–6, 7లోని పలు ప్రాంతాల్లో గురువారం జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్, డిప్యూటీ కమిషనర్‌ అలివేలు మంగతాయారు, వైద్యాధికారులు, పోలీసులతో కలిసి పర్యటించారు. సర్కిల్‌–6 పరిధిలోని అక్బర్‌బాగ్‌ డివిజన్‌లో మూడు పాజిటీవ్‌ కేసులు నమోదు కావడంతో బి–బ్లాక్‌ కాలనీ, ఆస్మాన్‌ఘడ్, తిరుమల హిల్స్, ఆనంద్‌నగర్, వాకర్‌బాగ్, జీవన్‌ యార్‌ జంగ్‌ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, సపోటాబాగ్, పూసలబస్తీ ప్రాంతాలు, చావునీ డివిజన్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సుల్తాన్‌దయారా, గుడ్డిబౌలి, బాగ్‌హే జహేరా, కుర్మగూడ కాలనీలు, అదే విధంగా ఆజంపురా డివిజన్‌లో ఆఫీసర్స్‌ కాలనీ, జడ్జెస్‌ కాలనీ, చంచల్‌గూడ, బాగ్‌హే జహేరా ప్రాంతాలు, ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో శంకర్‌నగర్, సరోజినీనగర్, పద్మానగర్, పంచశీల, మసీద్‌–ఇ–సాద్‌ బస్తీల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. సర్కిల్‌–7 సంతోష్‌నగర్‌ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌లో బెన్నీసాబ్‌కా బగ్లా, అలీ కేఫ్, గ్రేవియార్డ్, రోషన్‌దౌలా, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌ ప్రాంతాలు, కుర్మగూడ డివిజన్‌ దరాబ్‌జంగ్‌ కాలనీ, మస్కతీ గ్రౌండ్, సాలార్‌నగర్‌ ప్రాంతాలు, రెయిన్‌బజార్‌ డివిజన్‌ పరిధిలో ఇస్లామియా కాలేజీ, ఎస్సార్టీ కాలనీ, రెయిన్‌బజార్‌ చమాన్, మదీనానగర్, యశ్రఫ్‌నగర్, ఈస్ట్‌ చంద్రానగర్‌ ప్రాంతాల్లో అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించిన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టారు.  

చాదర్‌ఘాట్‌: ఓల్డ్‌ మలక్‌పేట, ఆజంపురాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తమ కాలనీల్లోకి రాకుండా కాలనీవాసులు బారీకేడ్లు తయారు చేసుకుని అడ్డుగా పెట్టుకున్నారు. రేస్‌కోర్స్, శంకర్‌నగర్, వాహెద్‌ నగర్లలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
అష్టదిగ్బంధనంలో నాలుగు బస్తీలు

హఫీజ్‌పేట్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ మూడు కేసుల నేపథ్యంలో చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని నాలుగు బస్తీలలో అష్టదిగ్బంధనం విధించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు సంయుక్తంగా చర్యలు ప్రారంభించారు. హఫీజ్‌పేట్‌ పరిధిలో స్థానికంగా 2.3 చదరపు కిలోమీటర్ల పరిధిని కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించారు. మియాపూర్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రాజారామ్‌కాలనీ మొదలు ఆల్విన్‌కాలనీ మీదుగా హఫీజ్‌పేట్‌ ఫ్లైఓవర్‌ వరకు, ఎడమ వైపు ఉన్న అన్ని ప్రాంతాలు, ఫ్లైఓవర్‌కు అవతలివైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆదిత్యనగర్, సుభాష్‌ చంద్రబోస్‌నగర్, మార్తాండనగర్, ప్రేమ్‌నగర్‌ బస్తీలు ఈ క్లస్టర్‌ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాలకు వెళ్ళే మొత్తం 54 ప్రధాన, అంతర్గత రహదారులను మియాపూర్‌ పోలీసులు మూసి వేశారు.

కంటోన్మెంట్‌లో కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లేవు : సీఈఓ
మారేడుపల్లి: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కొత్తగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని సీఈఓ ఎస్‌వీఆర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటీవ్‌ కేసు నమోదైన కంటోన్మెంట్‌ మహేంద్రాహిల్స్‌ వాసికి పూర్తిగా నయం అయిందన్నారు. అతని ద్వారా కూడా ఇతరులెవరికీ వ్యాధి సంక్రమించలేదన్నారు.

ప్రజలు సహకరించాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌
సాక్షి, సిటీబ్యూరో: కరోనా (కోవిడ్‌–19)వ్యాప్తి కట్టడికి నగరంలో ఏర్పాటు చేసిన 12 కంటైన్మెంట్‌ క్లస్టర్ల పరిధిలోని ప్రజలు బయటకు రాకూడదని, అలాగే బయటి వారు క్లస్టర్లలోనికి వెళ్లరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ నిబంధనల ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్లస్టర్‌ లోపల ఉన్నవారు సమస్యలను తెలియజేసేందుకు ఒక ప్రత్యేక నెంబర్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక శాసనసభ్యులు మిరాజ్‌ హుస్సేన్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పురపాలక శాఖ  ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ , హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌లతో కలిసి ఖైరతాబాద్‌ జోన్‌లోని మల్లేపల్లి (నాంపల్లి)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటైన్మెంట్‌ క్లస్టర్‌ పరిధి వరకు పూర్తిగా బారికేడింగ్‌ చేసి వైరస్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంటైన్మెంట్‌ నిబంధనల అమలును మానిటరింగ్‌ చేసేందుకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు