తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

8 Jun, 2020 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్‌, అసైన్‌‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
(చదవండి : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం) 

కాగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. కాగా అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. (చదవండి : తెలంగాణ‌లో షూటింగ్‌ల‌కు అనుమ‌తులు )

మరిన్ని వార్తలు