క్షయ నిర్మూలిద్దాం

24 Mar, 2014 01:35 IST|Sakshi

జిల్లావ్యాప్తంగా 8 టీబీ కేంద్రాలు ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జైనూర్, మందమర్రి, జన్నారం, బోథ్, చెన్నూరు, నర్సాపూర్(జి)లలో ఉన్నాయి. ఈ యూనిట్లలో రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందిస్తారు. వీటిల్లో 39 తెమడ పరీక్ష విభాగాలు ఉన్నాయి. తెమడ పరీక్ష కేంద్రాల్లో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఒకవేళ ఈ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలతో పూర్తిస్థాయిలో రిపోర్ట్ రాకపోతే జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కేంద్రానికి కేసులు పంపిస్తారు. అక్కడ వారికి తగిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారు.

 టీబీ అనగా..?
 క్షయ(టీబీ) ఒక అంటు వ్యాధి. ఇది స్త్రీ పురుషులకు ఏ వయసులోనైనా సోకవచ్చు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనినే శ్వాసకోశ క్షయ అంటారు.

 లక్షణాలు
 రెండు వారాలకు మించి ఎడతెరపి లేని దగ్గు. సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి తగ్గటం, ఛాతీ నొప్పి, బరువు తగ్గటం, తెమడలో రక్తం పడడం వంటివి జరిగితే అది టీబీ లక్షణంగా గుర్తించవచ్చు.

 ఎలా సోకుతుంది..?
 టీబీ సూక్ష్మక్రిముల ద్వారా సంక్రమిస్తుంది. టీబీ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని టీబీ క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వెళ్తాయి. ఈ తుంపర్లు ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ సోకిన వారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ.

 నిర్ధారణ
 ఉదయం, సాయంత్రం రెండుసార్లు తెమడ పరీక్షలు చేయించాలి. ఒకవేళ రెండుసార్లు పరీక్షలు నెగెటివ్ అయితే రోగి ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది.

 నయం చేయవచ్చు
 ప్రత్యక్ష పర్యవేక్షణ స్వల్పకాలిక చికిత్స(డాట్స్) ద్వారా క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధి నుం చి విముక్తి పొందవచ్చు. ఈ మందులు, చికిత్స సౌకర్యా లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందవచ్చు. కొత్తగా గుర్తించిన రోగుల చికిత్స కాలం 6 నుంచి 7 మా సాలు ఉంటుంది. సరిగా మందులు వాడకపోతే వ్యాధి ముదిరినవారికి, ఒకసారి నయమై మళ్లీ వ్యాధి సోకిన వారికి 8 నుంచి 9 నెలలు చికిత్స పొందాల్సి ఉంటుంది. టీబీ వచ్చిన వారికి వారానికి మూడు రోజులు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో లేక, మంగళ, గురు, శనివారాల్లో మందులు తప్పనిసరిగా వాడాలి.

మరిన్ని వార్తలు